మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
ఆదిలాబాద్ రూరల్, జూన్ 28: పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతుందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం 21 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ జహీర్ రంజాని, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా..
పట్టణంలోని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. భుక్తాపూర్ కాలనీలో అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం నిర్వహించారు. ఆంజనేయ స్వామికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రకాశ్, బండారి సతీశ్, సంద నర్సింగ్, నాయకులు పందిరి భూమన్న, కొండ గణేశ్, ఈర్ల సత్యనారాయణ, వెంకట్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఆక్సిజన్ సిలిండర్లు అందించడం అభినందనీయం
కరోనా రెండో దశలో అనేక మంది ఆక్సిజన్ లభించక మరణించారని ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేయడం అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. సోమవారం 2000 సంవత్సరానికి చెందిన గాంధీ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు జిల్లా కేంద్రంలోని రిమ్స్కు ఆక్సిజన్ సిలిండర్లను విరాళంగా అందించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్, డీఐవో విజయ సారథి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.