భూగర్భ జలాల పెరుగుదలతో రైతుల ఆసక్తి
బావి ఆధారిత సేద్యానికి ప్రాధాన్యం
యంత్రం సహాయంతో రెండు రోజుల్లోనే రెడీ
పల్లెల్లో జోరుగా బావుల తవ్వకాలు
కేసముద్రం, జూన్ 14: వేలకు వేలు ఖర్చు పెట్టి బోరు వేయిస్తం, కానీ నీళ్లు పడ్తయో లేదో తెల్వది. ఒకవేళ పడ్డా కొన్నేండ్లకే పూడుకుపోతుంది. అక్కడ మళ్లీ పూడిక తీయలేం. అదే బావి అయితే ఎప్పటికీ ఉంటుంది. పూడిక కూడా తీసుకోవచ్చు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన వివిధ ప్రాజెక్టుల ద్వారా భూగర్భజలాలు పుష్కలంగా పెరుగడంతో ఇప్పుడు రైతులంతా బావుల తవ్వకానికే మొగ్గుచూపుతున్నారు. క్రేన్లతో కాకుండా ఆధునిక యంత్రాలతో ఇప్పుడు కేవలం రెండు, మూడు రోజుల్లోనే బావులు సిద్ధమవుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో సాగు నీరు లేక రైతులు చాలా ఇబ్బందులు పడేవారు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టినా నీటి వసతి లేక పంట చేతికి రాక ఎండిపోయి ఆర్థికంగా నష్టపోయేవారు. దీంతో నీటి నిల్వలను బట్టి ఉన్న కొంత భూమిలో పంటలు సాగు చేయగా, మిగిలినవి బీడుగా వదిలేసేవారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం దక్కింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక యజ్ఞంలా మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బలోపేతం చేసి నీటి నిల్వ సామర్థ్యం పెంచారు. గోదావరిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు విడుదల చేస్తుండడంతో ఎండకాలంలోనూ చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు గణనీయంగా పెరిగి ఇప్పుడు బీడు భూములు కూడా సాగు భూములుగా మారిపోయాయి.
రెండు రోజుల్లో తవ్విన్రు..
నాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. వర్షం పడితేనే పంట సాగుచేసేది. కొన్నేండ్ల నుంచి వర్షాలు బాగా పడడం వల్ల చెరువులు నిండడం, రెండు మూడు నెలల పాటు కాల్వల నుంచి కాళేశ్వరం నీళ్లు రావడం వల్ల భూగర్భ జలాలు పెరిగాయి. అందుకే బోర్ల కంటే బావియే నయ్యమని అనుకున్నా. గంటకు రూ.3800 చొప్పున 18 గంటల్లో యంత్రం సహాయంతో తవ్వించిన. రూ.68వేల ఖర్చు వచ్చింది. బావిలో నీరు పుష్కలంగా ఉండడం మూలంగా మిర్చి పంటను సాగు చేస్తాను.
నూనావత్ కిషన్, కోమటిపల్లి రైతు
రెండు రోజుల్లోనే కొత్త బావి సిద్ధం
భూగర్భ జలాలు పుష్కలంగా పెరుగడంతో బావుల ఆధారిత సేద్యంపై రైతాంగం ఆసక్తి చూపుతున్నది. సాగు విస్తీర్ణం పెరుగుతుండడంతో పంటలకు నీటి ఇబ్బంది లేకుం డా ఉండేందుకు రైతులు బోర్లకు బదులు బావుల తవ్వకానికి ప్రాధాన్యమిస్తున్నారు. భూగర్భ జలాలు పెరుగడం, 24గంటల విద్యుత్ సరఫరా చేయడం, పంటల పెట్టుబడికి ప్రభుత్వమే రెండు సీజన్లలో ఆర్థిక సా యం ఇస్తుండడంతో రైతులు వ్యవసాయాన్ని సంబురంగా చేస్తున్నారు. అంతేకాకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు ప్రభుత్వం ఉచితంగా మోటర్లకు కనెక్షన్లు ఇస్తోంది. దీంతో సాగునీటి లభ్యతను పెంచుకునేందుకు రైతులు బోర్లు కాకుండా బావుల తవ్వకాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. బోర్లు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత పూడుకపోయి రైతులకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. బావి తవ్వితే పూడినప్పటికీ మళ్లీ తీయించే అవకాశం ఉండడంతో రైతులు బావుల తవ్వకానికి మొగ్గు చూపుతున్నారు. యం త్రాల సహాయంతో గంటకు రూ.3,800 చొప్పున వెచ్చించి రెండ్లు రోజుల్లోనే బావి తవ్వుతున్నారు. మరింత లోతు తవ్వేందుకు ర్యాంప్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీం తో సమయం ఆదా కావడం, ఖర్చు తగ్గడం తో ఎక్కువ మంది రైతులు క్రేన్ బదులుగా యంత్రాలను వినియోగిస్తున్నారు.