న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. కోవిడ్ నేపథ్యంలో 8 రంగాలకు ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించారు. గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ నేపథ్యంలోనూ కొన్ని రంగాలకు ఊరట కల్పించిన విషయం తెలిసిందే. ఆత్మనిర్బర్ భారత్లో భాగంగా ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించారు. కోవిడ్ వల్ల దెబ్బతిన్న రంగాలకు 1.1 లక్ష కోట్ల లోన్ గ్యారెంటీ ఇవ్వనున్నారు. వైద్య మౌళికసదుపాయాలను కల్పించేందుకు 50 వేల కోట్లు ఇవ్వనున్నారు. క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ కింద 25 లక్షల మందికి రుణాలు ఇవ్వనున్నట్లు మంత్రి సీతారామన్ తెలిపారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలకు ఈ రుణం అందించనున్నారు.
ఇతర రంగాలకు సుమారు 60 వేల కోట్ల రిలీఫ్ ప్యాకేజీని మంత్రి ప్రకటించారు. ఆ రుణాలకు పన్ను వసూల్ శాతాన్ని 8.25 శాతంగా ఫిక్స్ చేశారు. ట్రావెల్, టూరిజం రంగానికి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. 11వేల మంది టూరిస్టు గైడ్లు, ట్రావెల్, టూరిజం స్టేక్హోల్డర్లకు రుణాలు కల్పిస్తారు. వంద శాతం గ్యారెంటీతో ఆ రుణాలు ఇవ్వనున్నారు. అంతర్జాతీయ ప్రయాణికుల రాక మొదలైన తర్వాత తొలి 5 లక్షల మంది టూరిస్టులకు ఉచితంగా వీసాలు ఇవ్వనున్నట్లు మంత్రి సీతారామన్ చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజనను ఈ ఏడాది జూన్ 30వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించారు.
ప్రజా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు రూ.23,220 కోట్లు కేటాయించారు. చిన్నారుల సంరక్షణపై ఈ స్కీమ్లో ఎక్కువగా కేంద్రీకరించినట్లు మంత్రి నిర్మల తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. నర్సులు, డాక్టర్లు, వైద్య పరికరాలు, అంబులెన్సులు, ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఆ మొత్తాన్ని వినియోగిస్తారు. కానీ చిన్నారుల భద్రతే ముఖ్యంగా ఆ నిధుల్ని ఖర్చు చేస్తారు. కోవిడ్ కేంద్రీకృత హాస్పిటళ్లు 25 శాతం పెరిగినట్లు ఆమె చెప్పారు. 42 శాతం ఐసోలేషన్ బెడ్స్, 45 శాతం ఐసీయూ బెడ్స్ పెరిగినట్లు మంత్రి తెలిపారు.
ఫర్టిలైజర్ల సబ్సిడీ కోసం 14,775 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది రబీ సీజన్లో రికార్డు స్థాయిలో గోధుమలను సేకరించినట్లు మంత్రి చెప్పారు. రబీ మార్కెట్ సీజన్ వేళ నేరుగా రైతుల అకౌంట్లోకి 85,413 కోట్లు బదిలీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.