ఓటర్లను బెదిరించడానికి బీజేపీ కుట్ర ఇది
మమతా బెనర్జీ ధ్వజం
సిలిగురి, ఏప్రిల్ 11: కూచ్బిహార్లో ప్రజలపైకి కేంద్ర బలగాల కాల్పులు మారణహోమమే అని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. కాల్పుల ఘటన బీజేపీ కుట్ర అని ఆరోపించారు. ఓటర్లను బెదిరించడానికే ఈ దారుణానికి పాల్పడిందన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి హత్య అని అభివర్ణించారు. ప్రతీ బుల్లెట్కు ఓట్ల రూపంలో సమాధానం ఇస్తామని పేర్కొన్నారు. ఆదివారం ఆమె విలేకరులతో, ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. కూచ్బిహార్లోకి రాజకీయ నాయకులు ఎవరూ మూడు రోజుల దాకా వెళ్లొద్దంటూ ఎన్నికల సంఘం(ఈసీ) వాస్తవాలను నొక్కిపెట్టడానికి ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు. ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసమే ఈసీ పనిచేస్తున్నదని బీజేపీని ఉద్దేశించి అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మోదీ చెప్పినట్టు చేసే నియమావళి(మోదీ కోడ్ ఆఫ్ కండక్ట్)గా మార్చాలని ఎద్దేవా చేశారు. కాల్పులు జరిగిన సితాల్కుచి నియోజకవర్గానికి బుధవారం వెళ్తానని చెప్పారు. కేంద్రహోమంత్రి అమిత్ షా అసమర్థుడని విమర్శించారు. శనివారం సితాల్కుచిలో సీఐఎస్ఎఫ్ బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. దీనిపై టీఎంసీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అల్లరి మూకలను నియంత్రించడానికి బలగాలు ఎలాంటి నిబంధనలు పాటించలేదని మమత పేర్కొన్నారు. లాఠీ చార్జీ, టియర్గ్యాస్ లాంటివి ఏమీ వాడకుండా నేరుగా కాల్పులు జరిపారని అన్నారు. సీఐఎస్ఎఫ్ బలగాల కాల్పుల్లో చనిపోయిన నలుగురికి అంత్యక్రియలు పూర్తయ్యాయి.
మమత పిలుపుతోనే దాడి
కేంద్ర బలగాలను అడ్డుకోవాలని మమత ఇచ్చిన పిలుపే బలగాలపై దాడికి కారణమని అమిత్ షా ఆరోపించారు. మరణాలకు సంతాపం తెలిపే విషయంలో కూడా మమత బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బలగాల కాల్పుల్లో చనిపోయిన నలుగురికి సంతాపం ప్రకటించిన మమత, అదే రోజు మరో కాల్పుల ఘటనలో చనిపోయిన బీజేపీ కార్యకర్త ఆనంద్ బర్మన్ మృతిపై మాత్రం స్పందించలేదన్నారు. ఆనంద్ బర్మన్ టీఎంసీకి ఓటు వేయడని ఆమెకు తెలియడం వల్లే అతని గురించి మాట్లాడటం లేదన్నారు.