Fire @ Crackers Shop | తమిళనాడులోని కల్లాకురిచి జిల్లా శంకరపురంలో ఓ హోల్సేల్ ఫైర్వర్క్స్ దుకాణంలో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని కీలల్లో చిక్కుకుని ఐదుగురు మృత్యువాత పడగా, 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమీప దుకాణాలకు కూడా ఈ మంటలు అంటుకున్నాయి. దుకాణాల్లోని ఎల్పీజీ సిలిండర్లు బరస్ట్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది.
దీపావళి పండుగ సందర్భంగా పటాకులు కొనుగోలు చేయడానికి భారీగా ప్రజలు రావడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. గాయపడిన వారిలో 10 మందికి పైగా కల్లాకురిచి ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. కల్లాకురిచి, తిరుకోయిల్యూర్ల నుంచి ఐదు ఫైరింజన్లు వచ్చి మంటలు ఆర్పివేసేందుకు చర్యలు చేపట్టాయి.
అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవించడంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. పటాకుల దుకాణంలో అగ్ని ప్రమాదం పట్ల సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర సంతాపం తెలిపారు. బాధితుల కుటుంబాలకు రూ.5 లక్షల నగదు పరిహారం ప్రకటించారు.