న్యూఢిల్లీ : మే ఒకటో తేదీన మూడో దశ టీకాల పంపిణీ ప్రారంభం కానుంది. ఇందులో 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు టీకాలు వేయనుండగా.. బుధవారం సాయంత్రం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. భారీ స్పందన వచ్చింది. మొదటి మూడు గంటల్లో నిమిషానికి 2.7 మిలియన్ల హిట్స్ రాగా.. 1.45 కోట్ల టెక్ట్స్ మెస్సేజ్లు విజయవంతంగా పంపినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఒకేసారి పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్కు ప్రయత్నించడంతో కొవిన్ పోర్టల్ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఫలితంగా ఓటీపీలు రాలేదు. అయితే, అధికారులు సమస్య పరిష్కరించడంతో కొద్ది సేపటి తర్వాత పోర్టల్ అందుబాటులోకి రాగా.. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సజావుగా సాగింది.
టీకా షెడ్యూల్ సాధ్యం కాకపోయినప్పటికీ.. రిజిస్ట్రేషన్లు పెరగడం స్వాగతించే అంశమని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ నెలాఖరు వరకు ప్రైవేటు దవాఖానల్లో 45 ఏళ్లు పైబడిన వ్యక్తులకు మాత్రమే టీకాలు వేయనున్నారు. ఆ తర్వాత కేవలం ప్రభుత్వ హాస్పిటళ్లలో మాత్రమే ఇస్తారని అధికారులు తెలిపారు. కేంద్రం ప్రకటించిన ఇటీవల ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు 18 ఏళ్లు పైబడిన వ్యక్తుల కోసం టీకా తయారీ సంస్థల నుంచి 50 శాతం నేరుగా సేకరించుకోవచ్చు. ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకాలు వేయడం ద్వారా ప్రభుత్వ సౌకర్యాలపై భారం తగ్గుతుందని పేర్కొంది.
ఇప్పటి వరకు మొత్తం 14.71 కోట్ల రిజిస్ట్రేషన్లలో 9.33 కోట్ల మంది నేరుగా కేంద్రాలకు రాగా.. 2.82 కోట్లు ఆన్లైన్లో నమోదయ్యాయి. సుమారు 2.55 కోట్ల మంది ఆరోగ్య, ఫ్రంట్లైన్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వాలు నమోదు చేశాయి. మూడో దశలో ప్రారంభమైన ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయని అధికారులు పేర్కొన్నారు. 18 – 44 సంవత్సరాల మధ్య ఉన్న వారికి టీకాలు వేసేందుకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అర్హత ఉన్న వారంతా కోవిన్ పోర్టల్ (cowin.gov.in)లో, లేదంటే ఆరోగ్య సేతు యాప్లో పేర్లను నమోదు చేసుకోవచ్చు. రాష్ట్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులలోని టీకా కేంద్రాల వద్ద వ్యాక్సిన్లు అందుబాటు ఆధారంగా రిజిస్ట్రేషన్ జరుగుతుందని కేంద్రం పేర్కొంది.
స్లాట్లు అందుబాటులో లేక చాలా మంది నిరాశకు గురవుతున్నారని, త్వరలో మరిన్ని స్లాట్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. స్లాట్లు అందుబాటులో లేకపోతే మరోసారి తిరిగి ప్రయత్నించాలని, పరిస్థితిని అర్థం చేసుకుని సహనంతో ఉండాలని సూచించారు. వారం పది రోజుల్లో పరిస్థితులు మెరుగుపడుతాయని పేర్కొన్నారు. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సజావుగానే సాగుతోందని, సర్వర్ ఎలాంటి అవాంతరాలు లేకుండా పని చేస్తుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ప్రస్తుతం సెకనుకు 55వేల హిట్స్ను రికార్డు చేస్తోందని, పూర్తిగా స్థిరంగా ఉందని చెప్పింది.