9 మంది కరోనా రోగుల సజీవదహనం
ముంబైలోని దవాఖానలో అగ్నిప్రమాదం
బాధిత కుటుంబాలకు సీఎం ఠాక్రే క్షమాపణ
ముంబై, మార్చి 26: అది కరోనా రోగులు చికిత్స పొందుతున్న దవాఖాన. గురువారం అర్ధరాత్రి దాటింది. అంతా గాఢనిద్రలో మునిగిపోయారు. ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటలు.. దవాఖానను చుట్టుముట్టాయి. దట్టంగా కమ్ముకున్న పొగ రోగులకు ఊపిరి ఆడకుండా ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటన ముంబైలోని భాందుప్ ప్రాంతంలో ఉన్న డ్రీమ్స్ మాల్ భవనంలోని సన్రైజ్ కరోనా దవాఖానలో చోటుచేసుకున్నది. ప్రమాద సమయంలో దవాఖానలో 76 మంది రోగులు చికిత్స తీసుకుంటున్నారని, వారిలో తొమ్మిది మంది మృతిచెందినట్టు డీసీపీ ప్రశాంత్ కదమ్ శుక్రవారం వెల్లడించారు. ఇతర రోగులను సమీప దవాఖానకు తరలించినట్టు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. అయితే, అగ్నిప్రమాదం కారణంగా రోగులు మరణించలేదని సన్రైజ్ దవాఖాన వర్గాలు తెలిపాయి. వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న వారిని వేరే దవాఖానలకు తరలిస్తున్న సమయంలో రోగులు మరణించారని పేర్కొన్నాయి.
బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం: ఠాక్రే
అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటనా స్థలిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే శుక్రవారం సందర్శించారు. బాధిత కుటుంబసభ్యులకు క్షమాపణలు చెప్పారు. ప్రమాదానికి కారణమైన బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు.