న్యూఢిల్లీ : ఢిల్లీలో హత్యాచారానికి గురైన తొమ్మిదేండ్ల బాలిక తల్లితండ్రులతో తాను ఉన్న ఫోటోను షేర్ చేయడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై న్యాయవాది వినీత్ జిందాల్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాహుల్ చర్య పోక్సో చట్టం సెక్షన్ 23 కింద నేరమని, ఐపీసీ 228ఏ ఉల్లంఘన కిందకు వస్తుందని ఢిల్లీకి చెందిన న్యాయవాది జిందాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జిందాల్ ఫిర్యాదు మేరకు రాహుల్పై ఎఫ్ఐఆర్ నమోదైంది.
మరోవైపు హత్యాచారానికి గురైన దళిత బాలిక కుటుంబ సభ్యులతో తాను కలిసిఉన్న ఫోటోను షేర్ చేసిన రాహుల్ గాంధీపై చర్యలు చేపట్టాలని బాలల హక్కుల సంస్థ ఎన్సీపీసీఆర్ ఢిల్లీ పోలీసులు, ట్విటర్ను కోరింది. రాహుల్ చర్య జువెనిల్ జస్టిస్, పోక్సో చట్టాలకు విరుద్ధమని స్పష్టం చేసింది.