హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ఆంధ్రాప్రజలకు తాము వ్యతిరేకం కాదని, టీఆర్ఎస్తోపాటు, తెలంగాణ ప్రభుత్వ విధానం కూడా అది కాదని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో తాను చేసిన వ్యాఖ్య లు జలాలను అక్రమంగా తరలించుకుపోతున్న ఆంధ్రపాలకులపై, కృష్ణాలో నీటివాటాలు పంచని బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపైనేనని స్పష్టంచేశారు. ఈ మేరకు బుధవారం మంత్రి వేముల పత్రికాప్రకటన విడుదలచేశారు. మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం రైతుల పొట్టగొట్టేలా అక్రమ ప్రాజెక్టులు నిర్మించిన, నిర్మిస్తున్న ఆంధ్రాపాలకులను ఉద్దేశించి మాత్రమే మాట్లాడానని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గండికోట శ్రీకాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు రోజా, రవీంధ్రనాథ్రెడ్డి, ఏపీ బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గుర్తించాలని తెలిపారు. ఇక్కడ ఉంటున్న ఆంధ్ర, రాయలసీమ ప్రజలతో తెలంగాణ ప్రజలు ఏడేండ్లుగా సోదరభావంతో మెలుగుతున్న విషయం వాస్తవం కాదా? అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ, ఆంధ్రా రైతులందరూ బాగుపడాలనేదే సీఎం కేసీఆర్ విధానమని పేర్కొన్నారు. కృష్ణా నదిపై ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల వల్ల తెలంగాణ రైతులు నష్టపోతారనేది తమ బాధ అని వివరించారు. ‘ఎవరిమీద ఉద్యమం చేస్తారు’ అంటూ సోము వీర్రాజు అడుగుతున్నారని, కృష్ణా జలాల్లో తెలంగాణ నీటివాటాను తేల్చకుండా ఏండ్లుగా తాత్సారం చేస్తున్న బీజేపీపై, కేంద్రంపై ఉద్యమం చేస్తామని స్పష్టంచేశారు.
వైఎస్పై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా
మహబూబ్నగర్ జిల్లాల్లో వైఎస్పై తానుచేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మంత్రి వేముల స్పష్టంచేశారు. తెలంగాణ ఏర్పాటు కు వైఎస్ రాజశేఖర్రెడ్డి బద్ధవ్యతిరేకి కాదా? సోనియాకు తెలంగాణ ఇవ్వాలని ఉన్నా అడ్డుపడ్డ ఆయన తెలంగాణ బిడ్డల చావుకు కారణం కాలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణను అడ్డుకోవడానికి ఎన్నో అరాచకాలకు పాల్పడిన వైఎస్ రాజశేఖర్రెడ్డి ముమ్మాటికి తెలంగాణపాలిట రాక్షసుడేనని పేర్కొన్నారు. తెలంగాణ నీటిని అంధ్రకు తరలించిన నీటిదొంగ వైఎస్ రాజశేఖర్రెడ్డి అని.. అంతకు రెట్టింపు నీటిని తరలించేందుకు యత్నిస్తున్న వారిని ఏమనాలని ప్రశ్నించారు.
గ్రీన్ ట్రిబ్యునల్ స్టేను పాటించండి
ఒక్క శ్రీశైలం ప్రాజెక్టు నుంచే పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి లిఫ్ట్ల ద్వారా రోజుకు 9.12 టీఎంసీల నీటిని మళ్లించేలా ఏపీ ప్రభుత్వం అనుమతుల్లేకుండానే ప్రాజెక్టులు కడుతున్నదని వేముల తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తిచేసిన పాలమూరు, డిండి ప్రాజెక్టులు ఉమ్మడిరాష్ట్రంలోనే అనుమతులు పొందిన పాత ప్రాజెక్టులని స్పష్టంచేశారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను పాటించాలని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో వాటాను త్వరగా తేల్చాలని కేంద్రాన్ని కోరుదామని సూచించారు. ఆంధ్ర, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, బండి సంజయ్ ఈ బాధ్యత తీసుకోవాలని తెలిపారు. అప్పటిదాకా ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్ కుడికాలువ, రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వాన్ని మంత్రి వేముల డిమాండ్చేశారు.