అస్సాం, మిజోరం సరిహద్దులు రణరంగాన్ని తలపించాయి. వివాదాస్పద సరిహద్దు విషయమై అస్సాం పోలీసులు, మిజోరం స్థానికుల మధ్య సోమవారం తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇది ఇరురాష్ర్టాల ముఖ్యమంత్రుల మధ్య ట్విట్టర్ వార్కు తెరదీసింది. హింసాత్మక ఘటనల్లో అస్సాంకు చెందిన ఆరుగురు పోలీసులు మరణించినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా ఇటీవలే ఈ ప్రాంతాల్లో పర్యటించి ఢిల్లీకి వెళ్లగానే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.
గువాహటి/ ఐజ్వాల్, జూలై 26
అసలేం జరిగింది?
మిజోరంలోని సరిహద్దు గ్రామం వైరెంగ్తేలోని రైతులకు చెందిన ఎనిమిది గుడిసెలకు ఆదివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. దీంతో ఆగ్రహించిన మిజోరానికి చెందిన అక్కడి స్థానికులు అస్సాం సరిహద్దు పోలీసులతో లైలాపూర్ వద్ద గొడవకు దిగారు. కర్రలు, రాళ్లు, రాడ్లతో తమపై దాడిచేసినట్టు అస్సాం పోలీసులు ఆరోపించారు. కొందరి చేతుల్లో తుపాకులు కూడా ఉన్నట్టు చెప్పారు. అయితే, పోలీసులే తమపై బాష్పవాయు గోళాలు ప్రయోగించి, లాఠీ చార్జ్ చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాల్పులు కూడా జరిపినట్టు చెప్పారు. మరోవైపు, ఉద్రిక్తతల్లో భాగంగా అస్సాంకు చెందిన ఆరుగురు పోలీసులు మరణించినట్టు అస్సాం సీఎం తెలిపారు. మిజోరం పోలీసులు జరిపిన కాల్పుల్లో వీరు మరణించినట్టు ఆరోపించారు. ఉద్రిక్తతల్లో 80 మందికి పైగా పోలీసులు, స్థాని కులు గాయపడినట్టు అధికారవర్గాలు తెలిపాయి.
సీఎంల మాటల యుద్ధం
ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ట్విట్టర్ వేదికగా మాటల దాడికి దిగారు. తమ పౌరులపై అస్సాం పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తించారని మిజోరం సీఎం జోరం తంగా ఆరోపించారు. ఘర్షణల అంశంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా జోక్యం చేసుకోవాలని కోరారు. దీనిపై అస్సాం పోలీసులు ఘాటుగా స్పందించారు. మిజోరానికి చెందిన పౌరులు తమపై దాడికి పాల్పడ్డారని, వాహనాలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ.. జోరం తంగాకు ట్వీట్ చేస్తూ… ‘గొడవలు సద్దుమణిగే వరకూ పోలీస్ పోస్టులను వదిలేసి వెళ్లాలని మీ (మిజోరం) ఎస్పీ సూచిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో మేం ప్రభుత్వాన్ని ఎలా నడుపుతాం?’ అంటూ ప్రశ్నించారు. అనంతరం ట్వీట్ చేస్తూ.. ఉద్రిక్తతలపై మిజోరం సీఎంతో మాట్లాడానని బిశ్వశర్మ తెలిపారు. త్వరలోనే మిజోరం రాజధాని ఐజ్వాల్లో పర్యటిస్తానని చెప్పారు. ఇదిలాఉండగా.. ఘర్షణలపై అమిత్ షా ఇరురాష్ర్టాల సీఎంలతో మాట్లాడినట్టు సమాచారం. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలన్న షా సలహాకు ఇరు సీఎంలు అంగీకరించినట్టు తెలుస్తున్నది. కాగా అస్సాంలో బీజేపీ అధికారంలో ఉండగా, మిజోరంలో బీజేపీ మిత్రపక్షం మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉన్నది.
150 ఏండ్ల నుంచి వివాదం
అస్సాంలోని బరాక్ లోయకు సమీపంలోని కాచర్, కరీంగంజ్, హేలకండి జిల్లాలతో మిజోరంలోని ఐజ్వాల్, కోలాసిబ్, మామిట్ జిల్లాలు 164 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉన్నాయి. అయితే, సరిహద్దుల అంశంలో ఇరు రాష్ర్టాలకు గత కొన్ని దశాబ్దాలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గత ఆగస్టు, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ గొడవలు మరింతగా ముదిరాయి. కోలాసిబ్ జిల్లాలోని (మిజోరం) ఐత్లాంగ్ హ్నార్ ప్రాంతాన్ని అస్సాం పోలీసులు ఆక్రమించినట్టు మిజోరం ప్రభుత్వం ఆరోపిస్తున్నది. అయితే, హేలకండి జిల్లాలోనికి (అస్సాం) 10 కిలోమీటర్ల వరకు చొచ్చుకువచ్చిన మిజోరం స్థానికులు పంటలు పండిస్తున్నారని అస్సాం అధికారులు ఆరోపిస్తున్నారు. కాగా వివాదానికి కేంద్రంగా మారిన హ్నార్ ప్రాంతం మిజోరానికి చెందినదిగా రికార్డుల్లో ఉన్నది. బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ చట్టం, 1873 ప్రకారం 1875లో విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం ఆ ప్రాంతం తమదేనని మిజోరం చెబుతున్నది. అయితే దీన్ని అస్సాం అంగీకరించడం లేదు.