ప్రముఖ జర్నలిస్ట్, సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేష్ మరణం తెలుగు ఇండస్ట్రీని షాక్ లోకి నెట్టేసింది. కోలుకుని బయటికి వస్తాడు అని అంతా అనుకుంటున్న సమయంలో ఈయన చనిపోవడం అనేది చాలా మందికి అర్థం కావడం లేదు. జూన్ 26 తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురైన కత్తి మహేష్.. ఆ తర్వాత హాస్పిటల్ లో 10 రోజులకు పైగానే చికిత్స తీసుకుని మరణించాడు. తన సొంతూరు పీలేరు నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు చెన్నై, నెల్లూరు మార్గమధ్యంలో ఆగివున్న లారీని ఆయన ప్రయాణిస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో కారు డ్రైవర్ కూడా ఉన్నాడు.
అయితే ఆయన సీటు బెల్ట్ పెట్టుకోవడంతో ప్రమాదం నుంచి బయట పడ్డాడు. కానీ కత్తి మహేష్ సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. ముందు నెల్లూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించినా.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చెన్నై హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. అక్కడే కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నాడు కత్తి. ఈయన మరణవార్త తెలిసిన వెంటనే అతడి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కోలుకుని బయటికి వస్తాడు అనుకుంటున్న తరుణంలో కత్తి ఇలా కన్నుమూయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
అయితే ఈయన కడవరకు కూడా కాంట్రవర్సీలతోనే కాపురం చేసాడు. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 1లో ఎంపిక నుంచి కత్తి మహేష్ సోషల్ మీడియాలో సంచలనమే. జర్నలిజం బ్యాగ్రౌండ్ నుంచి బిగ్ బాస్ హౌజ్ కు వెళ్లి.. అక్కడ ఐదు వారాలు ఉండి బయటికి వచ్చాడు కత్తి. వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి అప్పుడు హైలైట్ అయ్యాడు. అప్పట్నుంచి ఆగకుండా పవన్ ను లక్ష్యంగా చేసుకుని కత్తి మహేష్ చేసిన కామెంట్స్ అభిమానులకు మంట పుట్టించాయి. పవన్ కళ్యాణ్ను తిట్టడం వల్లే కత్తి.. సెలెబ్రిటీ అయ్యాడనేది కాదనలేని వాస్తవం.
ప్రతీ చిన్న విషయానికి కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ గా రెచ్చిపోయేవాడు కత్తి మహేష్. అక్కడితో ఆగకుండా రాజకీయంగా, వ్యక్తిగతంగా పవన్ను అన్ని విధాలుగా టార్గెట్ చేసి హైలైట్ అయ్యాడు కత్తి మహేష్. ఎప్పటికప్పుడు కాంట్రవర్సీలతోనే ఉండటం ఈయన ప్రత్యేకత. చివరి వరకు కూడా అలాగే ఉన్నాడు కత్తి. ఈయన మాటలు ఓ వర్గానికి బాగా నచ్చేవి కూడా. అందుకే ఆయన్ని సపోర్ట్ చేసిన వాళ్లు కూడా లేకపోలేదు. జగన్ పార్టీకి అనుకూలంగా.. పవన్ ను ఎండగడుతూ ఎప్పటికప్పుడు విమర్శలు చేసేవాడు కత్తి. అయితే ఒక్కోసారి విమర్శలు హద్దులు మీరాయి కూడా. కత్తి మహేష్ లో విషయం కూడా చాలానే ఉంది. కానీ వివాదమే ఆయన్ని హైలైట్ అయ్యేలా చేసింది. ఏదేమైనా ఈయన కన్నుమూయడంతో సోషల్ మీడియా వేదికగా అంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.