న్యూఢిల్లీ: లోక్సభలో ఇవాళ ప్రధాని మోదీ తన మంత్రిమండలిని పరిచయం చేశారు. అయితే ఆ సమయంలో విపక్ష సభ్యులు ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన మధ్యే.. ప్రధాని మోదీ మాట్లాడారు. దేశానికి చెందిన దళితులు, మహిళలు, ఓబీసీలు మంత్రులు అయితే, ప్రతిపక్షాలకు సంతోషంగా లేదని ఆయన అన్నారు. పార్లమెంట్లో ఉత్సాహ వాతావరణం ఉంటుందని అనుకున్నానని, కొత్త మహిళా, దళిత ఎంపీలను స్వాగతిస్తున్నామని, ఎంపీలను పరిచయం చేయాలనుకున్నానని, కానీ కొందరికి మాత్రం దళిత ఎంపీలు మంత్రులు కావడం నచ్చడం లేదని ఆరోపించారు. పార్టీకి చెందిన వ్యవసాయ, గ్రామీణ నేపథ్యం ఉన్నవారు మంత్రులు అయినట్లు ప్రధాని చెప్పారు. మంత్రిమండలిలో ఓబీసీ వర్గం కూడా ఉందన్నారు. ప్రధాని మోదీ తన మంత్రిమండలి ప్రవేశపెడుతున్న సమయంలో విపక్షాలు అడ్డుకోవడాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తప్పుపట్టారు. విపక్ష సభ్యుల ఆందోళన మధ్య లోక్సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.