బెంగళూరు: భారీ వర్షంలో రోడ్డు పక్కన మొబైల్లో ఆన్లైన్ క్లాస్ వింటున్న కుమార్తెకు ఆమె తండ్రి గొడుగుపట్టారు. కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలోని మారుమూల బల్లాకా గ్రామంలో ఒక జర్నలిస్ట్ తీసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గ్రామానికి చెందిన బాలిక పదో తరగతి చదువుతున్నది. గ్రామంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేకపోవడంతో తండ్రి నారాయణ ప్రతి రోజు సాయంత్రం నాలుగు గంటలకు తన కుమార్తెను గ్రామానికి కాస్త దూరానికి తీసుకెళ్తాడు. మొబైల్లో ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యే రోడ్డు పక్కన ఉన్న ఆ ప్రాంతానికి ఆమె ప్రతి రోజు వచ్చి ఆన్లైన్ క్లాసులు వింటుంది. ఇటీవల వర్షం కురియడంతో ఆన్లైన్ క్లాస్ వింటున్న కుమార్తెకు తండ్రి నారాయణ గొడుగుపట్టారు. స్థానిక జర్నలిస్ట్ తీసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, దక్షిణ కన్నడ జిల్లా పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం సరిగా లేదని, దీనికి ఈ ఫొటో అద్దం పడుతున్నదని జర్నలిస్ట్ మహేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తిగార్, బల్లాకా, కమీల గ్రామాల విద్యార్థులు ఆన్లైన్ తరగతుల కోసం తమ ఇండ్లను వీడి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలకు వెళ్తుంటారని చెప్పారు. స్థానికులంతా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్పైనే ఆధారపడి ఉన్నారని, కరెంట్ లేని వేళల్లో నెట్వర్క్ పనిచేయదని విమర్శించారు. దీనిపై స్పందించిన బీఎస్ఎన్ఎల్ అధికారి సమస్యను పరిష్కరించేందుకు భారతీ ఎయిర్ ఫైబర్ ఇంటర్నెట్ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.