సిద్దిపేట, గజ్వేల్, మెదక్, సంగారెడ్డి, జోగిపేటలో ఆక్సిజన్ ప్లాంట్లు
వారం రోజుల్లో ఏర్పాటుకుప్రభుత్వం చర్యలు
అనువైన స్థలం ఎంపిక చేసినప్రత్యేక బృందం
ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు శుభవార్త అందించిన ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు
కరోనా వేళ రోగులకు భరోసా
సిద్దిపేట జోన్, మే 6 : కరోనా విజృంభిస్తుండడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో మెడికల్ ఆక్సిజన్ కొరత రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. సిద్దిపేట, గజ్వేల్, మెదక్, సంగారెడ్డి, జోగిపేటలో ఆక్సిజన్ ప్లాంట్లను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ శుభవార్తను ఉమ్మడి జిల్లా ప్రజలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు గురువారం తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాకేంద్ర ప్రభుత్వ దవాఖానలు, సిద్దిపేట వైద్య కళాశాల దవాఖాన, ఆర్వీఎం, సురభి మెడికల్ కళాశాలలో కరోనా బాధితులకు మెరుగైన వైద్యంతో పాటు మౌలిక వసతులు, కరోనా నివారణ చర్యలపై మంత్రి హరీశ్రావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో వ్యాక్సినేషన్, కరోనా వైద్యసేవలపై సమీక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆక్సిజన్ కొరత రాకుండా, సరిపడా అందుబాటులో ఉండేలా ఆక్సిజన్ ప్లాంట్లు (ఆక్సిజన్ తయారీ కేంద్రాలు) ఏర్పాటు చేసేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో గజ్వేల్, సిద్దిపేట జిల్లా కేంద్రం, సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, జోగిపేటలో, మెదక్ జిల్లా కేంద్రంలో ఆక్సిజన్ ప్లాంట్స్ రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. స్థల సేకరణకు జాతీయ రహదారుల శాఖ నుంచి ప్రత్యేక బృందం జిల్లాకు వచ్చింది. వారం రోజుల్లో పనులు ప్రారంభించాలని మంత్రి హరీశ్రావు వారికి ఆదేశించారు.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో నిమిషానికి వెయ్యి లీటర్లు తయారయ్యే ప్లాంట్స్, గజ్వేల్, జోగిపేటలో నిమిషానికి 500 లీటర్ల ఆక్సిజన్ తయారయ్యే విధంగా ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. వెయ్యి లీటర్ల ఉత్పత్తికి రోజుకు సుమారు 200 సిలిండర్లు, 500 లీటర్ల ఉత్పత్తికి సుమారు 100 సిలిండర్లు నింపే విధంగా ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థం (డీఆర్డీవో) ఆధ్వర్యంలో వీటి నిర్వహణ కొనసాగుతుంది.