న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: నూతన వ్యవసాయ చట్టాలతో రైతుల ఆగ్రహానికి గురైన మోదీ సర్కారు వ్యవసాయరంగంలో కొత్త కార్యచరణను తెరపైకి తీసుకొచ్చింది. దిగ్గజ అమెరికా సంస్థలు అమెజాన్, మైక్రోసాఫ్ట్, సిస్కోతో ప్రాథమికంగా ‘టెక్నాలజీ ఒప్పందం’ కుదుర్చుకున్నది. సాంకేతికత సాయంతో వ్యవసాయం తీరు తెన్నులు మారుస్తూ, ఉత్పాదకతను పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. దీంతో రైతుల ఆదాయం పెరుగడంతోపాటు.. సాగులో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది. తాజా ఒప్పందంలో భాగంగా భారత వ్యవసాయ రంగం డాటా, 2014 నుంచి వ్యవసాయ ఉత్పత్తుల గణాంకాలు మొదలగునవి ఆయా కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఒప్పందం కార్యరూపంలోకి రానున్నట్టు తెలుస్తున్నది. పంట దిగుబడి, భూసారం, ఎవరికెంత భూమి ఉందనే వివరాలను యాప్స్, టూల్స్ ద్వారా సేకరించడంతోపాటు, సమయానుకూలంగా రైతులకు సూచనలు, సలహాలను కూడా ఇవ్వడానికి ఈ ‘టెక్నాలజీ ఒప్పందం’తో సాధ్యమవుతుందని అధికారవర్గాలు తెలిపాయి. దేశీయ సంస్థలు రిలయెన్స్ జియో, ఐటీసీ కూడా ఈ ఒప్పందంలో భాగమయ్యాయి.
చౌకగా ధాన్యాన్ని కొనుగోలు చేసి..
‘టెక్నాలజీ ఒప్పందం’పై రైతు నేతలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. దిగ్గజ సంస్థలకు పంటల దిగుబడి, ధాన్యం క్రయ-విక్రయాల వంటి సమాచారం తెలిస్తే అన్నదాతలకు నష్టమేనని పంజాబ్కు చెందిన రైతునేత సుఖ్విందర్ సింగ్ సభ్రా అన్నారు. ఏ ప్రాంతాల్లో పంటల ఉత్పత్తి ఎక్కువగా ఉన్నది? చౌకగా ధాన్యం ఎక్కడ దొరుకుతుంది? ఆహార కొరత ఉన్న ప్రాంతాలేవి? తదితర డాటాను సర్వర్లలో నిక్షిప్తం చేసుకున్న కంపెనీలు.. ధాన్యాన్ని చౌకగా కొనుగోలు చేసి డిమాండ్ ఉన్న వేరే ప్రాంతాల్లో ఎక్కువ ధరకు దాన్ని విక్రయించే ప్రమాదమున్నదని ఆరోపించారు. రైతులు, భూ సమాచారం వంటి వివరాలు కంపెనీల చేతుల్లోకి వెళ్తే దాని భద్రత ఏమిటని మరో రైతు నేత అభిమన్యు ప్రశ్నించారు.