న్యూఢిల్లీ: వర్షాకాల సమావేశాలు జరిగినన్ని రోజులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ బయట నిరసన చేస్తామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆదివారం ప్రకటించింది. ఒక్కో రైతు సంఘం నుంచి ఐదుగురు చొప్పున 40 రైతు సంఘాల తరుఫున సుమారు 200 మంది రైతులు ప్రతి రోజు పార్లమెంట్ బయట నిరసనలో పాల్గొంటారని రైతు నాయకుడు గుర్నమ్ సింగ్ చారుణి తెలిపారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాలు ప్రతి రోజు సభలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కోరారు. ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు సభలో విపక్షాలు పోరాడితే పార్లమెంట్ బయట తాము నిరసన తెలుపుతామని అన్నారు. సభ నుంచి వాకౌట్ చేయవద్దని ప్రభుత్వం సమస్యను పరిష్కరించే వరకు సభను సాగనీయవద్దని ప్రతిపక్ష ఎంపీలను కోరారు. 19 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో రెండు రోజులు ముందుగా, ఈ నెల 17న అన్ని ప్రతిపక్ష పార్టీల ఎంపీలకు దీని గురించి లేఖ రాయనున్నట్లు చెప్పారు.
మరోవైపు భారీగా పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలపై ఈ నెల 8న దేశవ్యాప్త నిరసనకు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. గురువారం రోజు ప్రజలంతా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తమ వాహనాలను జాతీయ, రాష్ట్ర రహదారులపై నిలిపి నిరసనలో పాల్గొని విజయవంతం చేయాలని కోరింది.