ఢిల్లీ , జూన్ 6: దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు భారతీయ రైల్వేసంస్థ ఎంతో కృషి చేస్తున్నది. దేశంలోని పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ ను అందించడంలో రైల్వేసంస్థ తమదైన శైలిలో సేవలందిస్తున్నది. ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ లు26,000 మెట్రిక్ టన్నులకు పైగా ఆక్సిజన్ ను అందించాయి. ఇప్పటివరకూ 1,534 ట్యాంకర్ల ద్వారా 26281 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను వివిధ రాష్ట్రాలకు భారతీయ రైల్వే సరఫరా చేసింది. 376 ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లు తమ లక్ష్యాన్ని పూర్తిచేశాయి. తద్వారా ఆక్సిజన్ కొరతను ఎదుర్కొనే రాష్ట్రాలకు ఎంతో ఉపశమనం కలిగించాయి. మొత్తం 26 ట్యాంకర్లతో కూడిన 6 ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు 483 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను రవాణా చేస్తూ ఉన్నాయి.
దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు 3,000 మెట్రిక్ టన్నుల చొప్పున ప్రాణ వాయువును ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్ల ద్వారా అందుకున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ కు 2,800 మెట్రిక్ టన్నులకు పైగా ప్రాణవాయువును అందించాయి.ఆక్సిజన్ ను బట్వాడా చేసే ప్రక్రియను ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు 43రోజుల కింద ప్రారంభించాయి.అవసరమైన రాష్ట్రాలకు సాధ్యమైనంత తక్కువ వ్యవధిలో సాధ్యమైనంత ఎక్కువ పరిమాణంలో ఆక్సిజన్ ను అందించేందుకు భారత రైల్వే నడుం బిగించింది. అందులోభాగంగానే ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్ల ద్వారా తమకు ఆక్సిజన్ అందడంతో 15 రాష్ట్రాలు ఉపశమనం పొందాయి.