న్యూఢిల్లీ : రైతుల ఆందోళన వెనుక రహస్య అజెండా దాగుందని హర్యానా మంత్రి అనిల్ విజ్ పేర్కొన్నారు. రైతుల ఉద్యమం మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం కాదని దీని వెనుక రహస్య అజెండా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిష్టంభన తొలగించేందుకు చర్చలకు సిద్దమని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెబుతున్నారని, రైతులు కూడా ఇప్పటికి పలుమార్లు మంత్రితో చర్చలు జరిపారని అనిల్ విజ్ గుర్తుచేశారు.
వ్యవసాయ చట్టాలపై తమ అభ్యంతరాలు ఏమిటో రైతు సంఘాల నేతలు చెప్పలేకపోతున్నారని అన్నారు. ఈ వ్యవహారం చూస్తుంటే రైతులు మూడు వ్యవసాయ చట్టాల కోసం పోరుబాట పట్టలేదని ఏదో రహస్య అజెండా దాగుందని స్పష్టమవుతోందని చెప్పారు. రైతులు ఎప్పుడు చర్చలు పునరుద్ధరించాలని కోరినా కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులకు సిద్ధంగా ఉందని, రైతుల వాదన విని సమస్యను పరిష్కరించేందుకు సుముఖంగా ఉందని హర్యానా మంత్రి అనిల్ విజ్ స్పష్టం చేశారు.