న్యూఢిల్లీ, జూలై 8: దేశంలో సామాన్య జనానికి నానాటికీ భారమవుతున్న ఇంధన ధరలను సగానికి తగ్గించాలని రైతులు డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అన్నదాతలు.. పెట్రో ధరలకు నిరసనగా గురువారం దేశంలోని పలు చోట్ల ఆందోళన చేపట్టారు. సంయుక్త కిసాన్ మెర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనల్లో రైతులు రాష్ట్ర, జాతీయ రహదారుల పక్కన బైకులు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలను నిలిపి నిరసన తెలియజేశారు. పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు వంట నూనెల ధరలనూ తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.