కర్నాల్ (హర్యానా), సెప్టెంబర్ 7: హర్యానాలోని కర్నాల్లో మంగళవారం రైతులు కదంతొక్కారు. జిల్లా సచివాలయాన్ని ముట్టడించేందుకు వస్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కేనన్లు ప్రయోగించారు. అంతకుముందు జిల్లా సచివాలయానికి 5 కిలోమీటర్ల దూరంలోని న్యూ అనాజ్ మండీ వద్ద రైతులు భారీ సభ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది రైతులు ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్లపై సభా స్థలానికి చేరుకున్నారు. ఉదయం 11 గంటలకే అధికారుల నుంచి రైతు నేతలకు కబురు అందింది. దాంతో ప్రతినిధుల బృందం అధికారులతో చర్చలకు వెళ్లింది. రైతుల డిమాండ్లను అధికారులు అంగీకరించలేదు. దీంతో సభ అనంతరం రైతులు సచివాలయం వద్దకు బయలుదేరారు. పోలీసులు వాటర్ కేనన్లు ప్రయోగించినప్పటికీ తప్పించుకుని, బారికేడ్ల పైనుంచి దుంకుతూ కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. గత నెల 28న కర్నాల్లో రైతులపై లాఠీచార్జికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆ సందర్భంగా రైతుల తలలు పగులగొట్టండని ఆదేశించిన ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయాలన్నది డిమాండ్లలో ఒకటి. సంయుక్త కిసాన్ మోర్చా నేతలు రాకేశ్ టికాయత్, సింగ్ రాజేవాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహన్, దర్శన్ పాల్, యోగేంద్ర యాదవ్ తదితరులు సభలో పాల్గొన్నారు.
సాగు చట్టాలపై నివేదికను బయటపెట్టండి
న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాలపై సుప్రీంకోర్టు కమిటీ సమర్పించిన నివేదికను బహిరంగపరచాలని ఆ కమిటీ సభ్యుడు అనిల్ ఘన్వత్ మంగళవారం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను కోరారు. కమిటీ ఈ ఏడాది మార్చిలో తన నివేదికను అందజేసింది. అయితే దానిపై సుప్రీంకోర్టు శ్రద్ధ కనబరిచినట్టు లేదని ఘన్వత్ ఒక లేఖలో సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు. కర్నాల్లో రైతులపై పోలీసుల లాఠీచార్జి, దరిమిలా రైతుల ఆందోళనల నేపథ్యంలో ఘన్వత్ ఈ లేఖ రాశారు. రైతుల ఉద్యమాన్ని విరమింపజేసేలా ఈ నివేదికను ఉయోగించుకోకపోవడం బాధించిందన్నారు.