సిటీబ్యూరో, మే 29(నమస్తే తెలంగాణ): ఆన్లైన్లో బ్లాక్ ఫంగస్కు సంబంధించిన ఇంజక్షన్లు అమ్ముతామంటూ నమ్మించి.. నగర వాసికి సైబర్నేరగాళ్లు రూ. 4.5 లక్షలు టోక రా వేశారు. ఎస్ఆర్నగర్కు చెందిన నిఖిల్.. తన స్నేహితుడికి బ్లాక్ ఫంగస్ చికిత్సకు సంబంధించి అంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు కావాలంటూ ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాడు. ఒక్కటి రూ. 8 వేల చొప్పున.. 55 ఇంజక్షన్లు కావాలని కోరాడు. ఇందుకు ఆన్లైన్లో డబ్బులు కూడా చెల్లించాడు. ఆ తర్వాత సదరు పోర్టల్ నిర్వాహకుడిగా చెప్పుకున్న వ్యక్తి సెల్ఫోన్ స్విచాఫ్ చేశాడు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు శనివారం సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
హుస్సేనీఆలంకు చెందిన ఓ వ్యాపారి.. తన కుటుంబ సభ్యులతో కలిసి విమానంలో రాజస్థాన్కు వెళ్లాలనుకుని.. ఇందుకు కరోనా నిబంధనల కోసం గూగుల్లో గాలిస్తున్నాడు. ఓ వెబ్సైట్లో ఆర్టీపీసీఆర్, వ్యాక్సిన్ ఇప్పిస్తామంటూ ఉండగా.. అందులోని నంబర్కు ఫోన్ చేశాడు. తాము విమానం టిక్కెట్లు ఇప్పించడం దగ్గరి నుంచి అన్ని విషయాలు చూసుకుంటామని సైబర్నేరగాళ్లు నమ్మించారు. ముందుగా పది మందికి ఎయిర్పోర్టులోనే ఆర్టీపీసీఆర్ టెస్ట్లు చేయించేందుకు ఒకొక్కరికి రూ.1800 చెల్లించాలంటూ సూచించగా.. ఆ డబ్బు చెల్లించాడు. మళ్లీ వ్యాక్సినేషన్ కోసం డబ్బు చెల్లించాలని సూచించగా.. మొత్తం రూ. 98 వేలు ఫోన్ పే ద్వారా చెల్లించారు. అలా కాదని.. డెబిట్, క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే డిస్కౌంట్ వస్తుందంటూ బాధితుల వద్ద నుంచి డెబిట్ కార్డు వివరాలు తెలుసుకొని.. నాలుగు దఫాలుగా రూ. 49 వేల చొప్పున డ్రా చేశారు. ఆ తరువాత ఫోన్లు స్విచాఫ్ చేసుకున్నారు.. మొత్తం రూ. 2.94 లక్షలు సైబర్నేరగాళ్లు కాజేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అమెరికాలో ఉంటున్న ఓ వ్యక్తి ఫొటోను.. సైబర్ నేరగాడు తన వాట్సాప్ ప్రొఫైల్లో పెట్టుకుని.. అతని స్నేహితులకు మెసేజ్ పెట్టాడు. తన స్నేహితుడు హైదరాబాద్లోని దవాఖానలో కొవిడ్తో బాధపడుతున్నాడు, వెంటనే అతనికి డబ్బులు పంపించాలంటూ అందులో బ్యాంకు ఖాతా నంబర్ పెట్టాడు. వాట్సాప్ డీపీలో స్నేహితుడి ఫొటో చూసి.. నిజమని నమ్మిన ఇద్దరు స్నేహితులు ఆ ఖాతాలో రూ. 1.5 లక్షలు జమ చేశారు. ఆ తరువాత అమెరికాలో ఉంటున్న స్నేహితుడికి ఫోన్చేసి ఆరా తీయగా.. అసలు విషయం తెలిసింది.. మోసపోయామని గుర్తించిన బాధితులు సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సైబర్ క్రైం పోలీసులు ఆయా కేసులను నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.