సిర్సా: తమపై దేశద్రోహం కేసు నమోదు చేయడంపై హర్యానా రైతులు మండిపడ్డారు. ఈ కేసు కింద ఐదుగురు రైతులను గురువారం సిర్సాలో అరెస్ట్ చేయడంపై రైతులు శనివారం ఆందోళనకు దిగారు. పారామిలిటరీ దళాలను భారీగా మోహరించినప్పటికీ లెక్కచేయని రైతులు అడ్డుగా ఉంచిన బారికేడ్లను కూలదోశారు. ఈ నేపథ్యంలో పలువురు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు ఈ నెల 11న బీజేపీ నేత, హర్యానా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రణబీర్ గంగ్వా అధికార వాహనంపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో సుమారు వంద మంది రైతులపై దేశద్రోహం చట్టం కింద కేసు నమోదు చేశారు. గురువారం ఉదయం సిర్సాలో రైతుల ఇండ్లపై రైడ్ చేసిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు.
మరోవైపు రైతులపై దేశద్రోహం కేసు నమోదు, ఐదుగురి అరెస్ట్ను సంయుక్త కిసాన్ మోర్చా ఖండించింది. దీనికి వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలో భారతీయ కిసాన్ సంఘం రైతు నేత రాకేశ్ తికాయిత్ కూడా పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో సిర్సాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, వలసపాలన నాటి దేశద్రోహం చట్టాన్ని ఇంకా అమలు చేయడం అవసరమా అని సుప్రీంకోర్టు ఇటీవల ప్రశ్నించింది.