న్యూఢిల్లీ, మార్చి 13: కొత్త వ్యవసాయ చట్టాలను మోదీ సర్కార్ రద్దు చేసే వరకూ తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లేది లేదని పలుమార్లు స్పష్టంచేసిన రైతన్నలు.. ఢిల్లీలో సుదీర్ఘకాల ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో తాము నిరసన వ్యక్తం చేస్తున్న ప్రాంతాల్లో ఏకంగా ఇండ్లను నిర్మించుకుంటున్నారు. హర్యానాకు సమీపంలోని టిక్రీ, సింఘూ వద్ద ఇప్పటికే 25 ఇండ్లు నిర్మించారు. 2 వేల ఇండ్లు కట్టాలని భావిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసన అయిదో నెలలోకి ప్రవేశించింది. శీతాకాలంలో ఎముకలు కొరికే చలిని, ఇంటర్నెట్, విద్యుత్తు కోతల్ని, అనేక ఆంక్షలను చవిచూసిన రైతులు… ప్రస్తుత ఎండాకాలంలో సూరీడి ప్రతాపాన్ని తట్టుకోవటానికి వీలుగా ఇండ్ల నిర్మాణానికి పూనుకున్నారు. మెటీరియల్ ఖర్చును మాత్రమే వారు భరిస్తున్నారు. కార్మికులు ఉచితంగా సేవలందిస్తున్నారు. ఒక్కో ఇంటికి 20 వేల నుంచి 25 వేల ఖర్చవుతున్నదని రైతులు తెలిపారు. ఈ ఇండ్ల నిర్మాణానికి కిసాన్ సోషల్ ఆర్మీ (కేఎస్ఏ) సారథ్యం వహిస్తున్నది. మరోవైపు, రైతులకు ప్రతిపక్షాలు తగిన మద్దతు ఇవ్వడం లేదని బీకేయూ నేత రాకేశ్ టికయిత్ తెలిపారు. మోదీ ప్రభుత్వం తమను లక్ష్యం చేసుకుని దాడులు, దర్యాప్తులు చేయిస్తుందని ప్రతిపక్షాల నాయకులు భయపడుతున్నారని ఆరోపించారు.