న్యూఢిల్లీ: నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ.. ధర్నా చేస్తున్న రైతుల వైఖరిపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిరసన వ్యక్తం చేసే హక్కు రైతులకు ఉన్నదని, కానీ నిరవధికంగా రోడ్లను బ్లాక్ చేయడం సరికాదు అని సుప్రీంకోర్టు పేర్కొన్నది. యూపీలోని నోయిడాకు చెందిన మోనికా అగర్వాల్ వేసిన కేసును ఇవాళ సుప్రీం ధర్మాసనం విచారించింది. జస్టిస్ సంజయ్ కిషాన్ కౌల్, ఎంఎం సుందరేశ్లతో కూడిన ధర్మాసనం విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రైతుల ధర్నా అంశంలో తుది పరిష్కారం కావాల్సి ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నా.. రైతు నిరసన హక్కులకు వ్యతిరేకం కాదు అని, కానీ ఎప్పటికీ రోడ్లను బ్లాక్ చేయడం సరికాదు అని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నా చేస్తున్న నిరసనకారులను తొలగించేందుకు రైతు సంఘాలకు మూడు వారాల సమయం ఇస్తున్నట్లు కోర్టు పేర్కొన్నది.