మహబూబ్నగర్ : ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. మొక్కలతోనే మానవ మనుగడ ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం దేశంలో హరిత తెలంగాణగా మారనుందని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం ఆయన జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయ ఆవరణలో తెలంగాణ గెజిటెడ్ జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆర్టీఎ కార్యాలయంలో ప్రతి సంవత్సరం మొక్కలు నాటడం ఆనవాయితీగా వస్తుందన్నారు.
ఏ కార్యాలయంలో లేనివిధంగా ఆర్టీఏ కార్యాలయంలో పచ్చని మొక్కలతో కళకళలాడుతున్నదని తెలిపారు. చెట్లు పర్యావరణానికి ఎంతో ముఖ్యమని, తెలంగాణ రాక పూర్వం రాష్ట్రంలో కరువు, కాటకాలు, వర్షాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత మొక్కలు నాటడం, ఇంకుడు గుంతలను తవ్వడంతో నీరు నిల్వ ఉండి వర్షాలు కూడా సమృద్ధిగా కురుస్తున్నాయని తెలిపారు. ప్రతి ఇంటిలో తప్పనిసరిగా 6 మొక్కలు పెట్టుకోవాలని ప్రతి ఒక్కరు తన గురించి, తన ఆరోగ్యం గురించి చెట్లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరిపై కూడా మొక్కలు నాటే బాధ్యత ఉందన్నారు.
జిల్లా కేంద్రంలో తెలంగాణ రాక పూర్వం ఒక్క పార్క్ కూడా లేదని, ఇప్పుడు 25 పార్క్ లతో పాటు, దేశంలోనే అతి పెద్దదైన 2097 ఎకరాల కలిగిన ఎకో పార్కు జిల్లాలో ఉందన్నారు. మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధికి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు సహకరించి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ దుర్గా ప్రమీల , ఎంవీఐ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో పద్మశ్రీ, తెలంగాణ జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం కార్యదర్శి బక్కమి శ్రీనివాసులు, బాలచందర్, విజయకుమార్, వెంకటేష్ తదితరులు ఉన్నారు.