లక్నో : యూపీలోని అరుయ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ 50,000 రుణం చెల్లించడంలో విఫలమైనందుకు బ్యాంకు నోటీసులు పంపగా మనస్ధాపానికి గురైన రైతు గ్రామంలోని చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బ్యాంకు నోటీసు వచ్చిన రెండు రోజులకు రైతు తీవ్ర నిర్ణయం తీసుకుని తనువు చాలించాడు. బాధిత రైతును సుఖ్రాం భదౌరియాగా గుర్తించారు. బుధవారం ఉదయం ఇంటి నుంచి పొలానికి వెళ్లిన బధౌరియా రెండు గంటల తర్వాత గ్రామ శివార్లలోని వేపచెట్టుకు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్దలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బధౌరియా కరోనా ఫస్ట్వేవ్ తలెత్తిన సమయంలో తన కిసాన్ క్రెడిట్ కార్డును ఉపయోగించి రూ 50,000 బ్యాంకు రుణం తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని సకాలంలో చెల్లించడంలో విఫలం కావడంతో బ్యాంకు అతడికి నోటీసులు పంపింది. రికవరీ నోటీసులు అందడం, అప్పు చెల్లించాలని ఒత్తిడి పెరగడంతో రైతు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడని పోలీసులు తెలిపారు.