సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ ): ఈ నెల 24వ తేదీన ఎర్రగడ్డలోని చెస్ట్ దవాఖానను వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులతో కలిసి సందర్శించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. చెస్ట్ దవాఖాన ఆవరణలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపడం పట్ల దవాఖాన సూపరింటెండెంట్ మహబూబ్ఖాన్ ఆధ్వర్యంలోని పలు విభాగాలకు చెందిన వైద్యులు మంత్రి తలసానిని సోమవారం మాసాబ్ట్యాంక్లోని తన కార్యాలయం లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దవాఖానకు సంబంధించిన వివరాలను మ్యాప్ ద్వారా మంత్రికి వివరించారు.
ప్రజలకు మెరుగైన, నాణ్యమైన ప్రభుత్వ సేవలను అందించాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈనెల 24న వైద్య ఆరోగ్యశాఖలోని వివిధ వి భాగాలకు చెందిన ఉన్నతాధికారులతో కలిసి ఆసుపత్రిని సందర్శించి దవాఖాన నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తామని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో పల్మనాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నరేందర్, అనస్తీషియా ప్రొఫెసర్ అభిమన్యూ, సుజాత, ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్, ఆర్ఎంయూ సీమా తబస్సుం, నర్సింగ్ , సిటీ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ అనిత బల్లా తదితరులు ఉన్నారు.