న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీని ఢీకొనే సత్తా పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ ఒక్కరికే ఉందని గోవా మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలగిన సీనియర్ నేత లుజిన్హో ఫలీరో స్పష్టం చేశారు. ఫలీరో రాజీనామాతో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గోవాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలగా, దీదీపై ప్రశంసలతో ఆయన టీఎంసీలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది.
ఎమ్మెల్యే పదవికి సైతం ఫలీరో రాజీనామా చేశారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా ఫలీరో రాజీనామా చేశారని ఏఐసీసీ గోవా ఇన్ఛార్జ్ దినేష్ గుండూరావు ధ్రువీకరించారు. కాగా ఫలీరో టీఎంసీ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పోటీ చేస్తుందని, ముఖ్యమంత్రి అభ్యర్ధిని త్వరలో ప్రకటిస్తామని ఇటీవల గోవా పర్యటనకు వచ్చిన టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్ ప్రకటించారు.