ఏసీబీ దాడులతో మధ్యవర్తి ఘాతుకం
పథకం ప్రకారం ఏకకాలంలో రైడింగ్
కల్వకుర్తి రూరల్/వెల్దండ, ఏప్రిల్6: కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్లో, వెల్దండ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంతోపాటు హైదరాబాద్ నగరంలో ఏక కాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేసిన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకున్నది. పాలమూరు ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ కథనం మేరకు..రంగారెడ్డి జిల్లా కోరింటతండా సర్పంచ్ రాములు నాయక్ జనవరిలో వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 15 హెక్టార్ల స్థలంలో క్వారీ ఏర్పాటుకు పాలమూరు జిల్లా మైనింగ్ శాఖకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈక్రమంలో అధికారులు ఎన్వోసీ కోసం వెల్దండ తాసిల్దార్కు అప్పగించారు. తాసిల్దార్ సైదులుగౌడ్ కల్వకుర్తి పట్టణంలో నివాసం ఉంటున్న వెల్దండ మండలం చెదురుపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్యగౌడ్ను సంప్రదించాలని సూచించారు. వెంకటయ్యగౌడ్ను రాములునాయక్ కలవగా రూ.6లక్షలు డిమాండ్ చేశాడు. అంత ఇవ్వలేనని రూ.5లక్షలు ఇస్తానని ఒప్పుకున్నాడు. తర్వాత పాలమూరులోని ఏసీబీ అధికారులను సంప్రదించాడు. పథకం ప్రకారం.. మంగళవారం సాయంత్రం 4గంటలకు కల్వకుర్తిలోని వెంకటయ్యగౌడ్ నివాసంలో రాములు నాయక్ రూ.5 లక్షలు అప్పగించి బయటకు వచ్చాడు. ఏసీబీ అధికారులు దాడు లు చేశారు.
తలుపులు మూసి ఉండటంతో బద్దలు కొట్టుకొని ఇంట్లోకి వెళ్లారు. అప్పటికే గదిలో స్టవ్పై నోట్లను కాల్చుతుండగా.. వెంటనే నీళ్లు చల్లి ఆర్పారు. నగదును స్వాధీనం చేసుకొని వెల్దండ తాసిల్దార్ కార్యాలయం, హైదరాబాద్లోని జిల్లెలగూడలోని వెంకటయ్యగౌడ్ ఇంటిపై, ఉప్పల్లోని తాసిల్దార్ సైదులుగౌడ్ ఇంటిపై ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు. కాలిపోయిన నగదు, ఫైల్ను స్వాధీనం చేసుకొని ప్రత్యేక కోర్టులో అప్పగించనున్నట్లు వెల్లడించారు. కల్వకుర్తి నుంచి ఏసీబీ అధికారులు వెంకటయ్యగౌడ్ను వెల్దండ తాసిల్దార్ కార్యాలయానికి తీసుకురాగా అక్కడే ఉన్న రైతులు ఆగ్రహించి చితకబాదారు. ఏసీబీ అధికారుల వెంట కారు దిగి తాసిల్దార్ కార్యాలయంలోకి వెళ్తున్న క్రమంలో దాడి చేశారు. వెంకటయ్యను అధికారులు పట్టుకోవడంతో వెల్దండలో పటాకులు కాల్చి సంబురాలు చేశారు. దాడుల్లో డీఎస్పీ లింగస్వామి, రవిబాబు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
121 ఏండ్లలో మూడోసారి ఉష్ణమండలంగా భారత్!