పట్నా : డాక్టర్గా నమ్మబలుకుతూ ప్రైవేట్ నర్సింగ్ హోం నడుపుతున్న వ్యక్తి నవజాత శిశువును రూ 60,000కు విక్రయించిన ఘటన బిహార్లోని మధేపుర జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు ఆర్కే రవి బాబా విష్ణు రౌత్ హాస్పిటల్ పేరుతో రిజిష్టర్ చేయకుండా నర్సింగ్ హోంను నిర్వహిస్తున్నాడు. నర్సింగ్ హోంలో పనిచేసే సిబ్బంది కూడా ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే విధులు నిర్వహిస్తుండటం విశేషం. దవాఖానలో జరుగుతున్న అక్రమాలపై పోలీసులకు కొందరు సమాచారం చేరవేశారు.
ఈ ఆరోపణలపై విచారణ చేపట్టాలని మధేపుర జిల్లా మేజిస్ట్రేట్ అధికారులను ఆదేశించారు. దాడుల్లో నిందితుడు రవి దవాఖానలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును రూ 65,000కు అమ్మకానికి పెడుతూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. శిశువును కాపాడిన అధికారులు మధేపుర సదర్ హాస్పిటల్కు తరలించారు. నిందితుడు రవి, సహాయకుడు నవీన్ కుమార్లను అరెస్ట్ చేశారు. నవజాత శిశువులను తాను రూ 85,000 నుంచి రూ 1.5 లక్షలకు పలువురికి విక్రయించానని విచారణలో నకిలీ డాక్టర్ వెల్లడించాడు. దవాఖానను సీజ్ చేసిన పోలీసులు రోగులందరినీ సమీప పీహెచ్సీకి తరలించారు.