సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): కరోనా బారిన పడిన రోగులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నదని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. నిమ్స్, ఎర్రగడ్డలోని చెస్ట్ దవాఖానాలను మంత్రులు తలసాని, మహమూద్ అలీలు సందర్శించారు. అక్కడి రోగులకు ధైర్యవచనాలు చెప్పారు. మొదటగా నిమ్స్ ట్రామా బిల్డింగ్లోని కొవిడ్ సెంటర్లో వైద్య సేవలు పొందుతున్న రోగులను వారు పరామర్శించారు. అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్, వెంటిలేటర్ లాంటి సదుపాయాలపై ఆరా తీశారు. దాదాపు 250 మందికి వైద్య సేవలు అందిస్తున్నట్లు నిమ్స్ డైరెక్టర్ మనోహర్ మంత్రులకు వివరించారు. కొవిడ్ సేవలే కాకుండా ఇతర వైద్యసేవలను కూడా రోగులకు అందిస్తున్నట్లు డైరెక్టర్ తెలిపారు. నిమ్స్లో 1060 మంది కొవిడ్ రోగులు చేరగా.. ప్రస్తుతం 127 మంది చికిత్స పొందుతున్నారని.. మిగిలిన వారు కోలుకొని డిశ్చార్జి అయ్యారని మంత్రులకు డైరెక్టర్ వివరించారు.
కరోనా మహమ్మారి నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో సత్ఫలితాలు వస్తున్నాయని, కేసుల సంఖ్య చాలా తగ్గిందని మంత్రులు తలసాని , మహమూద్ ఆలీలు పేర్కొన్నారు. కరోనా బారిన పడిన వారికి అవసరమైన మందులు, చికిత్స విషయంలో ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పారు. హాస్పిటల్స్లో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలను చేపడుతున్నట్లు తెలిపారు. నగరంలో 94 కేంద్రాల ద్వ్రా 9.10 లక్షల మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. మొదటి డోస్గా 5.91 లక్షల మందికి వేసినట్లు మంత్రులు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం నుంచి రెండవ డోస్ ప్రారంభించినట్లు తెలిపారు.
ఎర్రగడ్డ చెస్ట్ దవాఖానను సందర్శించిన మంత్రు లు అక్కడి వైద్యులు, సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు. అందరికి మెరుగైన చికిత్సలు అందేలా సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఆదేశాలు, సూచనలు జారీ చేస్తున్నారని మంత్రులు ఈ సందర్భంగా వివరించారు. హైదరాబాద్ జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు అవసరమైన మందు లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లను సమకూర్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నారు. అనంతరం ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్ 1375 మంది కరోనా చికిత్స కోసం చేరగా.. వెయ్యి మందికి పైగా కోలుకున్నారని హాస్పిటల్ సూపరింటెండెంట్ మహబూబ్ఖాన్ మంత్రులకు వివరించారు. ప్రస్తుతం 17 మంది చికిత్స పొందుతుండగా వారి వద్దకు వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీటీస్కాన్, అల్ట్రాసౌండ్ పరికరాలు ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్ కోరగా వెంటనే మంత్రులు స్పందించారు. వాటి ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు వెంటనే పంపాలని టీఎస్ఎంఐడీసీ సీఈ రాజేంద్రకుమార్ను మంత్రి తలసాని ఆదేశించారు.