హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): షికాగోలో సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద చేసిన ప్రసంగంలోని విలువలను, ఆయన ఆదర్శాలను యువతకు బోధించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సామాజిక సమస్యలపై యువతకు అవగాహన ఉండాలని, సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ‘అందరికీ మంచి చేయడమే అన్ని మతాల సారం’ అని స్వామి వివేకానంద నమ్మారని చెప్పారు. హైదరాబాద్లోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్లెన్స్ను స్థాపించి 22 ఏండ్లు గడిచిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ రమణ వర్చువల్గా మాట్లాడారు. సంస్థ ద్వారా 19 లక్షల మంది ప్రయోజనం పొందడం అభినందనీయమన్నారు.
అన్ని కాలాలకు మార్గదర్శి
స్వామి వివేకానంద 1893లో చేసిన ప్రసంగాన్ని జస్టిస్ రమణ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ ప్రసంగం భారతావనికి విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిందన్నారు. మతం మూఢనమ్మకాలకు, ఛాందసత్వానికి అతీతంగా ఉండాలన్నారు. ‘తన ప్రసంగంలో స్వామి వివేకానంద ఉదారవాదాన్ని, సహనాన్ని ప్రచారం చేశారు. మతాల మధ్య గొడవల్లాంటి అర్థరహితమైన వివాదాలను విశ్లేషించారు. వాటి ద్వారా జరిగే ప్రమాదాన్ని నొక్కిచెప్పారు. వివేకానందుడి ఆదర్శాలు అన్ని కాలాలకు మార్గదర్శిగా నిలుస్తాయి’ అని అభిప్రాయపడ్డారు. వివేకానందుడి షికాగో ప్రసంగానికి ఈ సెప్టెంబర్ 11తో 128 ఏండ్లు నిండాయి.
హక్కులు యువకుల పోరాట ఫలితమే
యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలని జస్టిస్ రమణ పిలుపునిచ్చారు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఎన్ని సవాళ్లు ఎదురైనా ముందుకు నడవాలని సూచించారు. యువతకు స్వీయ సంపాదనతో పాటు సామాజిక స్పృహ కూడా ఉండాలన్నారు. రాజకీయ, సామాజిక అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. మనం అనుభవిస్తున్న ప్రజాస్వామిక హక్కులు గతంలో ఎందరో యువకులు చేసిన పోరాటాల ఫలితమేనన్నారు.
విజ్ఞానం వేళ్ల దగ్గరే
ఈ డిజిటల్ యుగంలో విజ్ఞానం అంతా వేళ్ల దగ్గరికి చేరిందని జస్టిస్ రమణ అన్నారు. నేటి యువతకు అందుబాటులో ఉన్న వనరులు గతంలో లేవని పేర్కొన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తాను చదువుకొనే సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు చెప్పారు. పుస్తక పఠనం, గ్రామాల్లోకి వెళ్లడం ద్వారా సమాజాన్ని అర్థం చేసుకోవాలన్నారు. విద్యార్థులకు సామాజిక అవగాహన పెంపొందించడంలో విద్యా సంస్థల పాత్ర కూడా కీలకమని అభిప్రాయపడ్డారు.