వరంగల్ అర్బన్ : బీజేపీ నేతలు చేతగాని చవటలు, దమ్ములేని దద్దమ్మలు అని బీజేపీ నేతలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఫైర్ అయ్యారు. వరంగల్లో మీడియా సమావేశంలో మంత్రి బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. మీరు రాష్ట్రానికి ఏమి చేయలేదు. కనీసం మీ నియోజకవర్గాల్లో ఏం చేశారో చెప్పండని నిలదీశారు.
సీఎం కేసీఆర్ను విమర్శించే అర్హత మీకు లేదన్నారు.
నిజామాబాద్ ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ రాసి ఇంట్లో పెట్టుకున్నావా? మొన్న మంజూరు చేసిన 157 మెడికల్ కాలేజీల్లో మీరు ప్రతినిధ్యం వహిస్తున్న కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్కు ఒక్క కాలేజీ అయినా తెచ్చుకున్నారా?
అని ప్రశ్నించారు.
మీ నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధి ఒక్కటైనా చెప్పగలరా? అలాంటి మీరు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి సీఎం కేసీఆర్ను తిడుతారా అని మండిపడ్డారు.
పన్నుల రూపంలో కేంద్రానికి రాష్ట్రం 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు ఇస్తే అందులో పావుల వంతు అయినా తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కేటాయించలేదన్నారు.
ఒక్క ఎంపీ కూడా గెలవని ఆంధ్రప్రదేశ్కు మాత్రం 4 మెడికల్ కాలేజీలు ఇచ్చారన్నారు.
కేంద్రం రాష్ట్రంపై ఇంతగా వివక్ష చూపుతుంటే, మీరేం చేస్తున్నారని నిలదీశారు.
తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఎంత వివక్ష చూపుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న బీజేపీ నేతలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
దయచేసి పట్టభద్రులు అందరూ టీఆర్ఎస్కు ఓటు వేసి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.