చెన్నై, మార్చి 13: నాస్తికత్వం పునాదులపై ఏర్పాటైన ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే).. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో క్రమంగా ఆస్తికత్వం వైపు మళ్లుతున్నది. తాజా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టో దీన్ని ధ్రువపరుస్తున్నది. ఆలయాల పునరుద్ధరణకు, సంరక్షణకు వెయ్యి కోట్లు కేటాయించనున్నట్టు మ్యానిఫెస్టోలో ఆ పార్టీ హామీ ఇచ్చింది. మసీదులు, చర్చ్లకు రూ.200 కోట్లు కేటాయించనున్నట్టు ప్రకటించింది. దేశంలోని ప్రముఖ హిందూ ఆలయాల సందర్శన కోసం వెళ్లే భక్తులకు రూ.25,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఇది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆలయాల పునరుద్ధణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని డీఎంకే హామీ ఇవ్వడంపై ఆ పార్టీ అధినేత స్టాలిన్కు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, విద్య, ఉద్యోగ రంగాలకు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో డీఎంకే పెద్దపీట వేసింది. రాష్ట్రంలోని పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చట్టం తెస్తామని ప్రకటించింది.