లక్నో: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు తయారు చేసిన 200 కేజీల జిలేబీలు, 1,050 సమోసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేయడంతోపాటు పది మందిని అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్లోని ఉన్నావో జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో హసంగంజ్కు చెందిన ఒక అభ్యర్థి ఓటర్లకు పంపిణీ చేసేందుకు భారీగా జిలేబీలు, సమోసాలు తయారు చేయించారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ అభ్యర్థి ఇంట్లో సోదాలు చేశారు. అప్పుడే వండి పంపిణీ కోసం ప్యాక్ చేసిన 200 కేజీల జిలేబీలు, 1,050 సమోసాలు, భారీగా మైదా, నెయ్యి, స్టవ్, గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. పది మందిని అరెస్ట్ చేయడంతోపాటు కరోనా, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘనపై కేసు నమోదు చేశారు.