లక్నో : ఆరోసారి పెండ్లికి సిద్ధమైన యూపీ మాజీ మంత్రి చౌధరి బషీర్పై ఆయన భార్య నగ్మా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో యూపీ సర్కార్లో మంత్రిగా పనిచేసిన బషీర్కు నగ్మా మూడో భార్య కావడం విశేషం. నగ్మా ఫిర్యాదుపై నిత్య పెండ్లికొడుకు, మాజీ మంత్రిపై ఆగ్రాలోని మంటోలా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని ఎస్పీ వెల్లడించారు. ముస్లిం మహిళా వివాహ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. షైష్ట అనే యువతితో బషీర్ ఆరోసారి పెండ్లికి సిద్దమయ్యాడని తనకు జులై 23న తెలిసిందని ఆమె వెల్లడించారు.
బషీర్ను సంప్రదించగా తనను వేధించడమే కాకుండా ట్రిపుల్ తలాఖ్తో తనకు విడాకులు ఇచ్చి ఇంటి నుంచి గెంటేశాడని నగ్మా వాపోయారు. బషీర్ మహిళలను వేధిస్తుంటాడని 2012లో తనకు ఆయనతో వివాహం జరగ్గా అప్పటి నుంచి శారీరకంగా, మానసికంగా చిత్ర హింసలకు గురిచేశాడని ఆరోపించారు. మాజీ మంత్రిపై పలు ఆరోపణలతో కూడిన వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఆమె పోలీసులు తనకు సాయం చేయాలని కోరారు.
మాయావతి ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన బషీర్ ఆపై ఎస్పీలో చేరారు. తర్వాత ఎస్పీ నుంచి బయటకు వచ్చి కొంతకాలంగా ఆయన ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది. బషీర్పై పలు కేసులు పెండింగ్లో ఉండగా ఓ కేసులో ఆయనకు కోర్టు 23 రోజుల జైలు శిక్ష విధించింది.