లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన బీఎస్పీ మాజీ ఎంపీ దావూద్ అహ్మద్ లక్నోలో నిర్మిస్తున్న భవనాలను అధికారులు ఆదివారం కూల్చివేశారు. నవాబ్ కోర్టులో ప్రతినిధిగా ఉన్న బ్రిటిష్ రెసిడెంట్ జనరల్కు నిలయమైన భవనాల సమూహాన్ని లక్నో రెసిడెన్సీగా పిలుస్తారు. 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ రెసిడెన్సీ కేంద్రంగా మొదటి స్వాతంత్ర్య యుద్ధం సందర్భంగా ముట్టడి జరిగింది. చారిత్రక ప్రాధాన్యత ఉన్న లక్నో రెసిడెన్నీని రక్షిత స్మారక కట్టడంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) గుర్తించింది. దీనికి 300 మీటర్ల పరిధిలో ఎలాంటి కట్టడాలకు అనుమతి ఇవ్వవద్దని పేర్కొంది.
కాగా, మాజీ ఎంపీ దావూద్ అహ్మద్ ఈ ప్రాంతానికి 123 మీటర్ల దూరంలో నివాస సముదాలను నిర్మిస్తున్నారు. 2018లో దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశించింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు మాజీ ఎంపీ అహ్మద్కు ఏఎస్ఐ కొంత సమయం ఇచ్చింది. అయినప్పటికీ ఆయన స్పందించకపోవడంతో లక్నో డెవలప్మెంట్ అథారిటీ అధికారులు ఆదివారం ఆ నిర్మాణాలను కూల్చివేశారు.
అయితే అక్రమ నిర్మాణాలను కూల్చే వాహనంపై భవన శిథిలాలు పడటంతో అది ధ్వంసం కాగా డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలో కూల్చివేతను పర్యవేక్షించే పోలీసులు, అధికారులు, సిబ్బంది అక్కడ నుంచి పరుగులు తీశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.