పాట్నా: బీహార్కు చెందిన జేడీయూ మాజీ ఎంపీ పవన్ వర్మ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి రాజీనామా చేశారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఈ మేరకు లేఖ రాశారు. ‘ప్రియమైన మమతా జీ, ఏఐటీసీ కార్యాలయానికి పంపిన నా రాజీనామాను దయచేసి ఆమోదించండి. నాకు లభించిన సాదర స్వాగతం, మీ ఆప్యాయత, మర్యాదలకు నేను మీకు ధన్యవాదాలు చెబుతున్నాను. మీతో సంప్రదింపులు జరిపేందుకు నేను ఎదురుచూస్తున్నాను. మీకు అంతా మంచి జరుగాలని కోరుకుంటున్నాను. హృదయపూర్వక నమస్కారాలతో పవన్ కె వర్మ’ అని శుక్రవారం ట్వీట్ చేశారు.
కాగా, దౌత్యవేత్త నుంచి రాజకీయ నేతగా మారిన పవన్ వర్మ, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ బీజేపీకి మద్దతివ్వడాన్ని తప్పుపట్టారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నితీశ్ కుమార్ సమర్థించడాన్ని ఆయన విభేదించారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్పై నితీశ్ కుమార్ పలుసార్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ లేఖ కూడా రాశారు. ఇదే అంశంలో నితీశ్పై అసంతృప్తి వ్యక్తం చేసిన రాజకీయ వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్తోపాటు పవన్ వర్మను జేడీయూ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో పవన్ వర్మ టీఎంసీలో చేరారు.
మరోవైపు ప్రస్తుతం బీహార్లో రాజకీయ పరిస్థితులు మారాయి. ఎన్డీయేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ మంగళవారం బీజేపీకి గుడ్బై చెప్పారు. సీఎం పదవికి రాజీనామా చేసిన ఆయన, ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్బంధన్ మద్దతుతో బుధవారం తిరిగి సీఎం పదవిని చేపట్టారు. ఈ నేపథ్యంలో పవన్ వర్మ శుక్రవారం టీఎంసీకి రాజీనామా చేశారు. నితీశ్ కుమార్ బీజేపీతో పొత్తు వీడటంతో తిరిగి సొంత పార్టీలో ఆయన చేరుతారని తెలుస్తున్నది.
కాగా, పవన్ వర్మ అనేక దేశాలకు భారత రాయబారిగా పనిచేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ప్రతినిధిగా కూడా ఉన్నారు. వర్మ అనేక పుస్తకాలు కూడా రచించారు. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం డ్రక్ థక్సే అవార్డును కూడా పొందారు.
Dear @MamataOfficial ji, Please accept my resignation from the @AITCofficial. I want to thank you for the warm welcome accorded to me, and for your affection and courtesies. I look forward to remaining in touch. Wishing you all the best, and with warm regards, Pavan K. Varma
— Pavan K. Varma (@PavanK_Varma) August 12, 2022