లక్నో: వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్లో తిరిగి విజయం సాధించే దిశగా బీజేపీ వ్యూహ రచన చేస్తున్నది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన సీనియర్ నేత జితిన్ ప్రసాద, ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన ఏకే శర్మ, లక్ష్మీకాంత్ బాజ్పాయి తదితరులు యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే యోగి తన క్యాబినెట్ను విస్తరించనున్నట్లు తెలుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా యోగి క్యాబినెట్లో కులాల మధ్య సమతుల్యత తేవడానికి కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. ముగ్గురు బ్రాహ్మణ సామాజిక వర్గ నేతలతోపాటు యూపీలో బీజేపీ మిత్రపక్షం నేత సంజయ్ నిషాద్ సహా మరో ఇద్దరు, ముగ్గురు నేతలకు చోటు కల్పిస్తారని వినికిడి.
గత మూడు ఎన్నికల్లో పార్టీకి దన్నుగా నిలిచిన యాదవేతర బలహీన వర్గాలు, జాతవేతర షెడ్యూల్ క్యాస్ట్, బ్రాహ్మణులను విశ్వాసంలోకి తీసుకోవాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నదని సమాచారం. యూపీలో తమను నిర్లక్ష్యం చేశారని బ్రహ్మణుల్లో అసమ్మతి పెరుగుతున్నట్లు వార్తలొచ్చాయి.
యూపీ ఎన్నికలకు ముందు యోగి క్యాబినెట్ విస్తరణ, పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్షా నివాసంలో మూడున్నర గంటల పాటు చర్చలు జరిగినట్లు తెలిసింది. ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పార్టీ నేతలు సునీల్ బన్సాల్, స్వతంత్ర దేవ్ సింగ్ తదితరులు పాల్గొన్నట్లు విశ్వసనీయ సమాచారం.