న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్లో ప్రస్తుతం నెలకొని ఉన్న దుర్బర పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ బాధిస్తున్నాయని ఆస్ట్రేలియా వ్యాఖ్యానించింది. భారత్లో ఆస్ట్రేలియా రాయబారిగా పనిచేస్తున్న బారీ ఓ ఫారెల్ ఆఫ్ఘన్ దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. భారత్, ఆస్ట్రేలియా సహా ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్లో శాంతిని నెలకొల్పే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే రెండు రోజుల క్రితం జరిగిన బాంబు పేలుళ్ల కారణంగా ఆఫ్ఘనిస్థాన్లోని ఆస్ట్రేలియా పౌరులను స్వదేశానికి తరలించే ప్రక్రియను నిలిపివేసినట్లు ఫారెల్ చెప్పారు.
ఇప్పటివరకు మొత్తం 4,000 మంది ఆస్ట్రేలియా పౌరులను ఆఫ్ఘనిస్థాన్ నుంచి తీసుకెళ్లామని బారీ ఓ ఫారెల్ వెల్లడించారు. ఇంకా తరలించాల్సిన వాళ్లు చాలా మంది ఉన్నారని, త్వరలో తరలింపు ప్రక్రియను పునరుద్ధరిస్తామని ఆయన తెలిపారు. కాగా, తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన ఆఫ్ఘనిస్థాన్లో గత 15 రోజులుగా అస్థిరత రాజ్యమేలుతున్నది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఐసిస్ ఉగ్రవాదులు కాబూల్లోని హమీద్ కర్జాయ్ విమానాశ్రయం పరిసరాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడటం కలకలం రేపింది.