న్యూఢిల్లీ: ఆయుష్మాన్ భారత్ డిజిటిల్ మిషన్ను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య చికిత్సను అందించడంలో ఎదురయ్యే సమస్యను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పరిష్కరిస్తుందని ఆయన అన్నారు. ఈ స్కీమ్ కింద ప్రతి భారతీయుడికి డిజిటల్ హెల్త్ ఐడీని ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక పౌరుడి హెల్త్ రికార్డు డిజిటల్ పద్ధతిలో సురక్షితంగా ఉంటుందన్నారు. డిజిటలైజేషన్ వల్ల ఆరోగ్య నియంత్రణ మరింత సులభం అవుతుందని ప్రధాని అన్నారు. టెక్నాలజీ ఆధారంగా.. ఆయుష్మాన్ భారత్ రోగుల సేవల గురించి దేశవ్యాప్తగా అన్ని హాస్పిటళ్లకు విస్తరిస్తుందన్నారు. సాంకేతికంగా బలమైన ఫ్లాట్ఫామ్తో సులభమైన వైద్య చికిత్స వీలవుతుందన్నారు. డిజిటల్ మౌళిక సదుపాయాలు ఇండియాలో భారీ స్థాయిలో ఉన్నాయని, దేశంలో యూపీఐ విధానంలో అన్ని పనులు జరుగుతున్నాయని, 118 మంది మొబైల్ వినియోగదారులు ఉన్నారని, 80 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారని, 43 కోట్ల మందికి జన్ధన్ అకౌంట్లు ఉన్నాయని, ఇలాంటి భారీ డిజిటిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ దేశంలోనూ లేదని మోదీ అన్నారు.
ఉచిత వ్యాక్సిన్ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా 90 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఇచ్చామని, దీంతో ఓ రికార్డును క్రియేట్ చేశామన్నారు. టీకాలు తీసుకున్నవారందరికీ సర్టిఫికేట్లు ఇచ్చామని, ఈ ఘనతలో కోవిన్ పోర్టల్ పాత్ర కీలకమైందని మోదీ ప్రశంసించారు. భారతీయ వైద్య ఆరోగ్య రంగంలో కల్పించే సదుపాయాల అంశంలో ఆయుష్మాన్ డిజిటిల్ మిషన్ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని మోదీ అన్నారు. మూడేళ్ల క్రితం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభిచామని, ఇప్పుడు డిజిటల్ మిషన్ ప్రారంభించడం సంతోషంగా ఉందని ప్రధాని తెలిపారు. ఇవాళ వరల్డ్ టూరిజం డే అని, ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకుంటే, అప్పుడు టూరిస్టులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తారన్నారు. అందుకే హిమాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు.
డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందికి మోదీ థ్యాంక్స్ చెప్పారు. వ్యాక్సినేషనైనా లేక కోవిడ్ చికిత్స అయినా, వైద్య సిబ్బంది సహాయం వల్లే కరోనా పోరాటంలో భారీ ఊరట దక్కిందన్నారు.