ఎన్హెచ్లపై రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు
డేంజర్ జోన్ల గుర్తింపు
స్పీడ్ లిమిట్ బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు
పరిమితి పాటించని వాహనదారులకు స్పీడ్ లేజర్ గన్తో ఫైన్
వరంగల్రూరల్, ఏప్రిల్ 13 (నమస్తేతెలంగాణ) : ‘స్పీడ్ థ్రిల్స్… బట్ కిల్స్’ వేగం ఆనందాన్ని ఇస్తుంది. కానీ, మనిషి ప్రాణాలనూ తీస్తుంది. అని దీనర్థం. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఎదురెదురుగా వాహనాలు ఢీకొని ప్రతి రోజు వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం అతివేగమే ప్రమాదాలకు కారణమని ఏటా ‘నాయ్ (ఎన్హెచ్ఏఐ) అధికారులు నిర్వహించే సర్వేలో వెల్లడవుతోంది. ఇటీవల వరంగల్ రూరల్ జిల్లాలో జరిగిన ఘటనలే ఇందుకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. హైదరాబాద్- భూపాలపట్నం 163 జాతీయ రహదారిపై దామెర మండలంలోని పసరగొండ క్రాస్రోడ్డు వద్ద 2020 సెప్టెంబరు 2న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ నుంచి ములుగు వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురు యువకులు అక్కడికక్కడే మరణించారు.
ఓ ఫంక్షన్కు హాజరైన వీరు తమ స్నేహితుడిని ములుగులో దింపి వచ్చేందుకు వరంగల్ నుంచి కారులో బయల్దేరి మార్గమధ్యంలో మృతి చెందారు. అతి వేగమే ఇందుకు కారణమని పోలీసులు గుర్తించారు. ఇదే ఎన్హెచ్పై ఆత్మకూరు మండలంలోని నీరుకుళ్ల క్రాస్రోడ్డు వద్ద మార్చి 9న మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు నుంచి నల్లబెల్లి మండలంలోని రంగాపురం గ్రామానికి మిర్చి ఏరేందుకు కూలీలతో వెళ్తున్న ప్యాసింజర్ ఆటోను ఎదురుగా వస్తున్న తూఫాన్ (జీపు) వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న నలుగురు మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. డ్రైవర్ సహా మరో పన్నెండు మంది కూలీలు గాయపడ్డారు. వీరిలో కొందరు ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. తుఫాన్ డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తే ఈ ప్రమాదానికి కారణమని పోలీసుల విచారణలో తేలింది. వాహనాల అతివేగంతో నిత్యం రహదారులు రక్తపుటేర్లుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు రోడ్డు ప్రమాదాలను అరికట్టడంపై దృష్టి సారించారు. రహదారులపై డేంజర్ జోన్లను గుర్తించి స్పీడ్ లిమిట్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు కొన్నిచోట్ల బారికేడ్లు పెడుతున్నారు. ప్రధానంగా ఎన్హెచ్లపై స్పీడ్ లేజర్ గన్లు ఏర్పాటు చేసి పరిమితికి మించి వేగంగా వెళ్తున్న వాహనాలకు ఫైన్ వేస్తున్నారు.
ప్రతి ఎన్హెచ్పై గన్
వరంగల్- ములుగు జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దామెరక్రాస్రోడ్డు మొదలుకుని పసరగొండ, ఒగ్లాపూర్, ఊరుగొండ, గూడెప్పాడ్, ఆత్మకూరు, నీరుకుళ్ల క్రాస్రోడ్డు, కటాక్షపురం వద్ద ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో నిత్యం ఒకటి రెండు ప్రమాదాలు జరుగడం పరిపాటిగా మారింది. గూడప్పాడ్ నుంచి పరకాల మీదుగా భూపాలపల్లికి వెళ్లే ఎన్హెచ్పైనా ఇదే పరిస్థితి. కొత్తగట్టు, సింగారం, మాందారిపేట, గోవిందాపురం, కామారెడ్డిపల్లె, పరకాల వద్ద నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పరకాల ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో రెండు ఎన్హెచ్లపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలను డేంజర్ జోన్లుగా ప్రకటించారు. ఎన్హెచ్ అధికారులతో కలిసి స్పీడ్ లిమిట్ బోర్డులు ఏర్పాటు చేయించారు. జనవరి నుంచి రెండు ఎన్హెచ్లపైనా స్పీడ్ లేజర్ గన్తో వాహనాల వేగాన్ని గుర్తిస్తున్నారు. దామెర, ఆత్మకూరు, శాయంపేట, పరకాల పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రతిరోజు స్పీడ్గన్ పనితీరును పర్యవేక్షిస్తున్నారు.
ఇప్పటికే రూ.19 లక్షల ఫైన్
ప్రతిరోజూ ఒకేచోట కాకుండా వివిధ ప్రదేశాల్లో గన్ ఏర్పాటు చేస్తారు. ఆ ప్రదేశంలో వాహనాల స్పీడ్ను గన్ ద్వారా పరిశీలించి పరిమితికి మించి వేగంగా వెళ్తున్న వాహనాలను గుర్తించి ట్రిగ్గర్ నొక్కుతుంది. దీంతో వాహన రిజిస్ట్రేషన్ నంబరు సహా వాహనం ఫొటో గన్లో నమోదవుతుంది. వెంటనే యజమాని మొబైల్కు ఫైన్ మెసేజ్ వెళ్తుంది. లొకేషన్, సమయం, ఫైన్ వివరాలు అందులో ఉంటాయి. ఇలా రెండు నెలల పది రోజుల వ్యవధిలో పరకాల పోలీసు సబ్ డివిజన్ పరిధిలో పరిమితికి మించిన వేగంతో వెళ్లిన వాహనదారులకు రూ.19 లక్షల ఫైన్ విధించారు. గూడెప్పాడ్ వద్ద జనవరి 21న పరకాల ఏసీపీ శ్రీనివాస్ తొలి స్పీడ్ లేజర్ గన్ను ప్రారంభించారు. అప్పటి నుంచి వాహనదారులపై 253 కేసులు నమోదు చేసి రూ.2,61,855 ఫైన్ విధించారు. ఫిబ్రవరిలో 765 కేసులు నమోదు చేసి రూ.7,91,775, మార్చిలో 810 కేసులు రూ.8,38,350 ఫైన్ విధించారు.