న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల పరిశీలకులను కూడా తాము నిశితంగా గమనిస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ సునీల్ అరోరా తెలిపారు. పశ్చిమ బెంగాల్లో సాధారణ పరిశీలకుడిని తొలగించడంపై బుధవారం ఆయన స్పందించారు. పశ్చిమ బెంగాల్లో ఒక సాధారణ పరిశీలకుడి అనుచిత ప్రవర్తన గురించి తమకు సమాచారం అందిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22న ఆయనను తొలగించినట్లు వెల్లడించారు. ఆ అధికారిని సస్పెండ్ చేయాలని కూడా నిర్ణయించుకున్నామని, చార్జిషీట్ కూడా దాఖలు చేస్తామని తెలిపారు. పార్టీలు, అభ్యర్థులతోపాటు సాధారణ ఎన్నికల పరిశీలకులను కూడా తాము నిశితంగా గమనిస్తున్నామని సునీల్ అరోరా వెల్లడించారు.