జెనీవా: కరోనా మహమ్మారి రకాల్లో ఇటీవల కొత్తగా వెలుగుచూసిన డెల్టాప్లస్ రకం వ్యాప్తి పలు దేశాలను కలవరపెడుతున్నది. దీనిపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. డెల్టా ప్లస్ వేరియంట్ను కట్టడి చేయడానికి వ్యాక్సిన్ ఒక్కటే సరిపోదని, వ్యాక్సిన్తోపాటు మాస్కులు ధరించడం వంటి కరోనా కట్టడి చర్యలను తప్పకుండా పాటించాలని స్పష్టంచేసింది. WHO ఇప్పటికే ఈ వేరియంట్ను ఆందోళనకర రకంగా పేర్కొన్నది.
డెల్టా రకాన్ని ఎదుర్కోవడంలో వ్యాక్సిన్ ఒక్కటే సరిపోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ రష్యా ప్రతినిధి మోలీటా వునోవిక్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ +మాస్కులను తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టంచేశారు. వ్యాక్సినేషన్వల్ల వైరస్ వ్యాప్తిని కొంతవరకు తగ్గించడంతోపాటు తీవ్ర ఇన్ఫెక్షన్ ప్రభావం నుంచి బయటపడవచ్చని చెప్పారు. అయినప్పటికీ అదనపు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని, స్వల్ప కాలంలో ఈ చర్యలు చేపట్టకపోతే మరోసారి లాక్డౌన్ దిశగా అడుగులు వేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
11 దేశాలకు విస్తరించిన డెల్టా ప్లస్
డెల్టా ప్లస్ వేరియంట్ను ఆందోళనకరమైనదిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈమధ్యే ప్రకటించింది. ఇప్పటికే ఈ రకం 11 దేశాలకు వ్యాపించగా.. దాదాపు 200లకు పైగా కేసులు నమోదయ్యాయి. అమెరికా, భారత్తోపాటు బ్రిటన్, పోర్చుగల్లో ఈ కేసుల సంఖ్య అధికంగా ఉంది. చాలా దేశాల్లో కరోనా వైరస్ మరోసారి విజృంభణకు ఈ వేరియంట్ దోహదం కానున్నదని WHO హెచ్చరించింది. అందుకే వ్యాక్సిన్తో పాటు మాస్కులు వంటి కొవిడ్ కట్టడి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.