న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఇటీవల వేలాది మందికి ఫాబీఫ్లూ అనే మందులను ఉచితంగా అందజేశారు. కరోనా వైరస్తో బాధపడుతున్న పాజిటివ్ పేషెంట్లకు ఆయన ఫాబీఫ్లూ ట్యాబ్లెట్లను ఇచ్చారు. దీనిపై కోర్టులో ఆయనకు వ్యతిరేకంగా వ్యాజ్యం దాఖలైంది. అయితే ఈ అంశంపై ఇవాళ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించారు. తాను పంపిణీ చేసిన మందులు అత్యవసరమైనవని, నాపై వేల సంఖ్యలో వ్యాజ్యాలు దాఖలు చేసినా.. తాను మాత్రం ప్రాణాలు రక్షించేందుకు ప్రజాసేవ చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
బీజేపీ ఎంపీ గంభీర్ అక్రమ రీతిలో ఫాబీప్లూ మందులను భారీ సంఖ్యలో సేకరించినట్లు పిల్లో ఆరోపించారు. దీనిపపై విచారణ చేపట్టాలని ఢిల్లీ హైకోర్టు.. సోమవారం డీసీజీఐని ఆదేశించింది. గంభీర్పై దాఖలైన పిల్ అంశంలో జస్టిస్ విపిన్ సింగ్ స్పందించారు. సరఫరా ఎక్కువగా లేని ఆ ఔషధాన్ని గంభీర్ ఎలా ప్రొక్యూర్ చేశారని, ఆయన ఉద్దేశం మంచిదే అయినా.. కానీ ఇది ఎంత వరక సమంజసమైన ప్రవర్తన అని జస్టిస్ ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసుల నివేదిక ప్రకారం.. ఎంపీ గంభీర్ సుమారు 2862 ఫాబీఫ్లూ స్ట్రిప్పులను కొనుగోలు చేశాడు.
గార్గ్ హాస్పిటల్కు చెందిన డాక్టర్ సంజయ్ గార్గ్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం గంభీర్ ఫాబ్లీ ఫ్లూ ట్యాబ్లెట్లను తెప్పించాడు. అయితే అంత భారీ మొత్తంలో ఓ కెమిస్ట్ ఎలా ఆ మందులను అమ్మినట్లు కోర్టు ప్రశ్నించింది. దీపిక్ సింగ్ వేసిన పిటిషన్ను కోర్టు విచారిస్తూ ఈ ప్రశ్నలు వేసింది. తీవ్రంగా కోవిడ్ ఉన్న రోగులకు డాక్టర్లు ఫాబీ ఫ్లూ మందును సూచిస్తున్న విషయం తెలిసిందే.