బీజింగ్: అడుగున అద్దాలు వేసిన వంతెనపై విహారం బాగానే ఉంటుంది. చైనాలో ఇలాంటి వంతెనలు చాలానే ఉన్నాయి. కానీ ఒక్క పలక జారినా ప్రాణాలకు ముప్పే. ఓ టూరిస్టు అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. చైనాలోని లాంగ్జింగ్ నగరంలోని పియాన్ కొండపై 100 మీటర్ల ఎత్తున ఉండే అద్దాల వంతెన ఓ టూరిస్టు స్పాట్. కాళ్ల కింద పారదర్శకంగా ఉండే అద్దం లోనుంచి కిందకు చూడడం సరదా. 150 కిలోమీటర్ వేగంతో వీచిన ఈదురు గాలులకు కొన్ని గాజు పలకలు ముక్కలై ఎగిరిపోయాయి. వాటి మీదుగా నడుస్తున్న టూరిస్టు ఒక్కసారిగా కిందకు పడబోయాడు. అంతలోనే తమాయించుకుని రెయిలింగ్ను పట్టుకున్నాడు. ముందుకు వెళ్లలేక.. వెనుకకు రాలేక అక్కడే బిక్కుబిక్కుమంటూ గడిపాడు. అగ్నిమాపకదళం, పోలీసులు, టూరిజం సిబ్బంది అంతా కలిసి అతడిని సురక్షితంగా తీసుకురావడానికి అరగంట పైనే పట్టింది. చైనా మైక్రోబ్లాగింగ్ సైటు “వెయిబో”లో ఈ వార్తను పోస్టే చేస్తే 58 లక్షల మంది చూశారు. సదరు టూరిస్టుకు ఏమీ కాలేదు. కానీ పరీక్షలు, కౌన్సెలింగ్ నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు.