న్యూఢిల్లీ: ఇప్పటి వరకూ ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) నుంచి 550 మందిని ఆరు ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చినట్లు భారత విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. అందులో 260 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపింది. వీళ్లందరినీ కాబూల్ లేదా దుశాంబె నుంచి తరలించినట్లు విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు. ఇతర ఏజెన్సీ ద్వారా కూడా అక్కడి భారతీయులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అమెరికా, తజకిస్థాన్లాంటి దేశాలతో తాము టచ్లో ఉన్నట్లు అరిందమ్ వెల్లడించారు.
మెజార్టీ శాతం భారతీయులను ఇప్పటికే తరలించినట్లు తాము అంచనాకు వచ్చామని ఆయన తెలిపారు. మరికొందరు ఆఫ్ఘనిస్థాన్లోనే ఉండొచ్చు. కచ్చితంగా ఎంత మంది ఉన్నారో తెలియదు అని అరిందమ్ అన్నారు. ఆఫ్ఘన్లతోపాటు కొన్ని ఇతర దేశాల వాసులను కూడా తాము ఇండియాకు తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. వీళ్లలో చాలా మంది సిక్కులు, హిందువులు ఉన్నారు. అయితే ప్రధానంగా మేము భారతీయులపైనే దృష్టి సారిస్తున్నాం. అదే సమయంలో మనకు అండగా ఉన్న ఆఫ్ఘన్లకు అండగా ఉంటామని అరిందమ్ స్పష్టం చేశారు.