వాణీదేవికి పట్టభద్రుల నుంచి అద్భుత స్పందన..
బీజేపీ అభ్యర్థి ఏం చేశారని ఓట్లడుగుతాడు?
నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే టీఆర్ఎస్కే ఓటెయ్యాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ విజ్ఞప్తిచేశారు. ఆరేండ్ల్లుగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎమ్మెల్సీగా ఉన్న బీజేపీ నేత రాంచందర్రావు ప్రజలకు, పట్టభద్రులకు ఏంచేశారో చెప్పాలని నిలదీశారు. అధికార టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవిని గెలిపిస్తే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి మరింత వేగాన్ని అందుకుంటుందని చెప్పారు. పట్టభద్రుల ఎన్నికలకు టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఇంచార్జిగా ఉన్న మంత్రి గంగుల కమలాకర్ ‘నమస్తే తెలంగాణ’తో శనివారం ప్రత్యేకంగా మాట్లాడారు.
అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించారు కదా.. దీని ప్రభావం ఏమైనా ఉన్నదా?
మంత్రి: లేటుగా వచ్చినా.. లేటెస్టుగా వచ్చాం. వ్యూహాత్మకంగానే మా అభ్యర్థి పేరును లేటుగా ప్రకటించాం. అందువల్ల ఎలాంటి వ్యతిరేక ప్రభావం లేదు. పైగా అనుకూలంగా ఉన్నది. తెలంగాణ తెచ్చిన పార్టీగా, అధికారంలో ఉన్న పార్టీగా ప్రజలకు మాపై అచంచలమైన విశ్వాసం ఉన్నది. కేసీఆర్ నాయకత్వంపై నమ్మకం ఉన్నది. మా అభ్యర్థి పీవీ కుమార్తె. గొప్ప విద్యావేత్త, నిష్కళంకమైన మనిషి.
పట్టభద్రుల నుంచి స్పందన ఎలా ఉన్నది? ప్రచార వ్యూహమేంటి?
పట్టభద్రుల నుంచి అద్భుత స్పందన వస్తున్నది. ఎక్కడికి వెళ్లినా ఈసారి వాణీదేవినే గెలిపిస్తామని చెప్తున్నారు. పట్టభద్రులందరిని వ్యక్తిగతంగా కలిసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే జిల్లాల్లో సమావేశాలు పెట్టాం. ప్రతి 50 మంది పట్టభద్రలైన ఓటర్లకు ఒక పార్టీ ఇంచార్జిని నియమించాం. ప్రతిరోజు ఉదయం ఆరుగంటల నుంచి రాత్రి వరకు ఓటర్లను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాం. మా కార్యకర్తలంతా ఉత్సాహంగా పనిచేస్తున్నారు.
ఏ నినాదంతో పట్టభద్రులను కలుస్తున్నారు?
అభివృద్ధే మా నినాదం. ప్రతిపక్షాలు రాజకీయాల కోసమే ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత లక్షా 32 వేలకుపైగా ఉద్యోగాలను ప్రభుత్వరంగంలోనే ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ సర్కారుది. 2014కు పూర్వం హైదరాబాద్ ఎలా ఉన్నది..? 2014 తర్వాత హైదరాబాద్ ఎలా ఉన్నదో ఒక్కసారి బీజేపీ నాయకులు తిరిగి చూడాలి.
మత ప్రభావం ఏమైనా ఉంటుందా?
ఇది పట్టభద్రుల ఎన్నిక. పట్టభద్రులు ఆలోచనాపరులు. బీజేపీ మతవిభజనను గుర్తిస్తున్నారు. చాలా చోట్ల బీజేపీ నేతలను వారు నిలదీస్తున్నారు. ఆరేండ్లలో ఏం చేశారని అడుగుతున్నారు. మా పార్టీ కూడా హిందూ పార్టీనే కదా? బండి సంజయ్, రాంచందర్రావు మమ్మల్ని మించిన హిందువులా? పట్టభద్రుల ఎన్నికలో మత ప్రభావం ఏమీ ఉండదు. మా పార్టీ అన్ని మతాలను సమభావంతో చూస్తుంది.
హైదరాబాద్ జిల్లాలో పార్టీ క్యాడర్ను ఎలా సమన్వయం చేసుకుంటున్నారు?
నేను 2016, 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ తరఫున ఇంచార్జిగా పనిచేశా. ఇక్కడి ఓటర్ల శైలి, కార్యకర్తలతో పనిచేయడం అలవాటయ్యింది. వాణీదేవిని గెలిపించుకుంటాం.