చెన్నై: డీఎంకే పార్టీకి చెందిన సీనియర్ నేత ఈవీ వేలూ ఇంట్లో ఇవాళ రెండవ రోజు కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. శుక్రవారం కూడా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈవీ వేలూ ఇంటి వద్ద సుమారు 3.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికల వేళ వేలూ ఇంటి నుంచి భారీ మొత్తంలో నగదు బయటకు వెళ్తున్నట్లు సమాచారం రావడంతో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. స్వంత ఊరితో పాటు చెన్నైలోనూ నిన్న తనిఖీలు జరిగినట్లు ఓ అధికారి చెప్పారు. తిరువన్నమళ్లై నియోజకవర్గంలో ఉన్న వేలూ ఇంటితో పాటు మొత్తం 10 చోట్ల సోదాలు జరిగాయి. మరోవైపు డీఎంకే నేత వేలూ తరపున ఆ పార్టీ చీఫ్ స్టాలిన్ గురువారం ఎన్నికల ప్రచారం చేపట్టారు.