శ్రీహరికోట, ఆగస్టు 11: భూపరిశీలన కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పంపించనున్న జీఎస్ఎల్వీ-ఎఫ్ 10 ప్రయోగానికి బుధవారం కౌంట్డౌన్ ప్రారంభమైంది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈవోఎస్-03 ఉపగ్రహాన్ని గురువారం ఉదయం 5.43 గంటలకు ఈ వాహకనౌక ద్వారా నింగిలోకి పంపనున్నారు. వాస్తవానికి గత ఏప్రిల్, మేలోనే ఈ ప్రయోగం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, దేశంలో కరోనా సెకండ్వేవ్ కారణంగా ఈ మిషన్ వాయిదా పడింది. భారత భౌగోళిక సరిహద్దుల ఛాయాచిత్రాలను ఎప్పటికప్పుడు పంపించడం, ప్రకృతి విపత్తుల హెచ్చరికలను జారీచేయడం వంటి ప్రయోజనాల నిమిత్తం ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. 2019లో చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ శ్రేణి వాహకనౌకను ఈ ప్రయోగానికి వినియోగిస్తున్నారు.